జగన్ వ్యూహాత్మక నిర్ణయం

ప్రభుత్వం భర్తీ చేసిన వివిధ కార్పొరేషన్ ఛైర్మన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎంఎల్ఏల్లో ఎవరినీ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమించలేదు. వైసీపీ అధికారంలోకి రాగానే కొన్ని కార్పొరేషన్లను నియమించారు. అప్పట్లో నియమించిన కార్పొరేషన్లకు ఛైర్మన్లకు ఎంఎల్ఏలను మాత్రమే నియమించారు. ఏపీఐఐసీ, తుడా, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మల్లాది విష్ణు, రాజాలను నియమించారు.

అప్పట్లో ఛైర్మన్లుగా ఎంఎల్ఏలను నియమించటానికి కారణం మంత్రివర్గంలో చోటు కల్పించలేదనే ప్రచారం జరిగింది. రెండేళ్ళ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకేసారి 135 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించటం గమనార్హం. ఇదే విషయమై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతు కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా కేవలం పార్టీ నేతలను మాత్రమే నియమించినట్లు చెప్పారు. పనిలో పనిగా సామాజికవర్గాలను కూడా సంతృప్తి పరిచారు. ప్రతి జిల్లాలోని నేతలకు పదవులు వచ్చేట్లు జగన్ జాగ్రత్తలు తీసుకున్నారు.

జగన్ తాజా నిర్ణయం మంచి పరిణతి కనిపిస్తోంది. ఎలాగంటే ఎంఎల్ఏలకు ఇస్తే మంత్రి పదవులు ఇవ్వాలే కానీ మళ్ళీ కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా అవసరం లేదు. ఎందుకంటే ఎంఎల్ఏనే ఒక పదవి మళ్ళీ వాళ్ళకే కార్పొరేషన్ పదవులు ఇవ్వటంలో అర్ధంలేదు. ఎంఎల్ఏ టికెట్లు దక్కనివారు, ఓడిపోయిన వారిని ఛైర్మన్లుగా నియమిస్తే వాళ్ళ కష్టానికి గుర్తింపు లభించినట్లు ఫీలవుతారు. ఇదే పద్దతిలో ఎంఎల్ఏ టికెట్లు ఆశించకుండా పార్టీకి పనిచేసిన వారిని గుర్తించి వారికి కూడా ఛైర్మన్లుగా డైరెక్టర్ పదవుల్లో అవకాశం ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు.

ఇపుడు పదవులు అందుకున్న వారి కాలపరిమితి రెండేళ్ళుంటుంది. అంటే ఈ రెండేళ్ళు పూర్తయ్యే సమయానికి మళ్ళీ ఎన్నికల వాతావారణం వచ్చేస్తుంది. అప్పుడు వీళ్ళ స్ధానంలో మళ్ళీ కొత్తగా మరికొందరిని నియమిస్తే అప్పుడు ఇంకా ఎక్కువ మంది నేతలకు అవకాశాలు కల్పించినట్లవుతుంది. ఈ విధంగా ఐదేళ్ళలో కొన్ని వందలమంది నేతలకు జగన్ పదవులు ఇచ్చినట్లవుతుంది. మళ్ళీ ఎన్నికల సమయానికి పదవులు అందుకున్న వాళ్ళల్లో చాలామంది రెట్టించిన ఉత్సాహంతో పార్టీ విజయానికి కృషి చేసే అవకాశం ఉంది. ఈ విధంగా చూస్తే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లే అనుకోవాలి.