అల్లు వారి లేడీస్ స్పెషల్


టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఆధ్వర్యంలో గత ఏడాది మొదలైన ‘ఆహా’ మొదట్లో చిన్న చిన్న అడుగులే వేసింది. ఎక్కువగా తమ దగ్గరున్న సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు.. అలాగే కొన్ని చిన్న స్థాయి వెబ్ సిరీస్‌లు మాత్రమే అందుబాటులో ఉంచింది. కానీ తర్వాత నెమ్మదిగా కొత్త కంటెంట్ పెంచుతూ వచ్చింది. సొంతంగా పెద్ద ఎత్తున వెబ్ సిరీస్‌ల నిర్మాణం చేపట్టి సబ్‌స్క్రైబర్లను పెంచుకునే ప్రయత్నంలో పడింది.

తాజాగా ఆహాలో విడుదలైన ‘కుడి ఎడమైతే’ వెబ్ సిరీస్ మంచి స్పందన రాబట్టుకుంటున్న సంగతి తెలిసిందే. యువ దర్శకులు, నిర్మాతల సహకారంతో మరిన్ని వెబ్ సిరీస్‌లను ఆహా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఉంది. తాజాగా ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ ఆహా కోసం ఓ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తుండటం దీనికి ‘అన్యాస్ ట్యుటోరియల్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. శుక్రవారం అల్లు అరవింద్, శోభు యార్లగడ్డతో పాటు ఈ వెబ్ సిరీస్ టీం ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి అనౌన్స్ చేశారు.

మహిళలు ప్రధాన పాత్రలు పోషించడంతో పాటు ఓ మహిళే దర్శకత్వం వహించిన సిరీస్ ఇది కావడం విశేషం. పల్లవి గంగిరెడ్డి అనే కొత్త దర్శకురాలు ఈ సిరీస్‌ను రూపొందించింది. ఇందులో రెజీనా ప్రధాన పాత్ర పోషించింది. నివేదిత అనే ఓ కొత్త నటి మరో కీలక పాత్రను పోషించింది. ఈ సిరీస్‌కు రచయిత కూడా ఓ మహిళే. ఆమె పేరు.. శౌమ్య శర్మ. అల్లు అరవింద్, శోభు యార్లగడ్డ లాంటి పెద్దవాళ్లు అండగా నిలబడి.. ఇలా మహిళలతో ఓ వెబ్ సిరీస్ తీయడం విశేషమే. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన రెజీనా చేస్తున్న తొలి వెబ్ సిరీస్ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న రెజీనా.. తెలుగులో డిజిటల్ డెబ్యూకు రెడీ అయింది. మరి. ఈ లేడీస్ స్పెషల్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందో చూడాలి.