ఆ జిల్లా ల్లో వైసీపీలో నేత‌ల జోరు.. నిల‌చేదెవ‌రు.. నిల‌బెట్టేదెవ‌రు?

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ చాలా జిల్లాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. క‌నీసం.. టీడీపీకి ఒక్క‌స్థానం కూడా ద‌క్క‌ని జిల్లాలు ఉన్నాయి. ఇలాంటి జిల్లాల్లో ఇప్పుడు వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉంది? నేత‌ల బ‌లం ఎలా ఉంది? ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఓ ఏడాది ఉన్న జోరు ఇప్పు డు క‌నిపిస్తోందా? ఇక తిరుగులేదు.. అనుకున్న ప‌రిస్థితి.. ఇప్పుడు కూడా ఉందా? అంటే.. క‌ష్ట‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు.
నెల్లూరు, క‌ర్నూలు, క‌డ‌ప‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న క‌ర్నూలు, విజ‌య‌న‌గ‌రం జిల్లాలు కూడా వైసీపీ వ‌శం అయ్యాయి. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? అనేది చ‌ర్చ‌.

గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం చూసిన త‌ర్వాత‌.. వైసీపీ నేత‌లు త‌మ‌కు తిరుగేలేద‌న్నట్టుగా భావిస్తున్నారు. అయితే.. ఒక్క విజ‌యం తోనే ఏదీ ప‌ట్టు సాధించేయ‌ద‌నే విష‌యం.. తెలుసుకోవ‌డంలో నేత‌లు వెనుక‌బ‌డుతున్నారు.

సంస్థాగ‌తంగా.. టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ ఉన్న ఈ జిల్లాల్లో.. వైసీపీ క్లీన్ స్వీప్ చేయ‌డం ఆశ్చ‌ర్య‌మే అయిన‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇదే విధ‌మైన ఫ‌లితం ఉంటుంద‌ని మాత్రం చెప్ప‌లేం. ఎందుకంటే.. విజ‌య‌న‌గ‌రం జిల్లాను చూసుకుంటే.. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆధిప‌త్యం తీవ్ర స్థాయిలో ఉంది.

ఒక‌వైపు.. కీల‌క నేత‌లు ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌నే దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అంతేకాదు..కుటుంబ రాజ‌కీయాల ను గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు ఎలా చేశారో.. ఇప్పుడు కూడా అదే పంథా కొన‌సాగిస్తున్నారు.

ఫ‌లితంగా.. బొత్స‌ పై పెరిగే వ్య‌తిరేక‌త‌.. అంతిమంగా పార్టీపై చూపిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. నిజానికి ఎంపీ కూడా ఇక్క‌డ మంత్రి క‌నుస‌న్న‌ల్లోనే ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇక్క‌డ బ‌లుపు కాదు.. వైసీపీది వాపేన‌ని వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇబ్బంది త‌ప్ప‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, నెల్లూరులో రెడ్డి సామాజిక‌వర్గం దూకుడు కార‌ణంగా.. వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో జిల్లా మొత్తం వైసీపీ ఖాతాలో ప‌డింది. అయితే.. ఏ రెడ్డి వ‌ర్గం.. అండ‌దండ‌లతో అయితే.. పార్టీ పుంజుకుందో.. ఇప్పుడు అదే రెడ్లు.. వ్య‌తిరేక స్వరం వినిపిస్తున్నారు. “మాకేం ఒరిగింది?” అనే మాట జోరుగా వినిపిస్తోంది. ఇది క‌నుక మున్ముందు పెరిగితే.. అంతిమంగా.. వైసీపీకి ఎదురుగాలి త‌ప్ప‌దు.

ఇక‌, క‌ర్నూలు విష‌యానికి వ‌స్తే.. టీడీపీకి ఇక్క‌డ ఫైర్ బ్రాండ్ నేత‌లు చాలా మంది ఉన్నారు. కానీ, గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ గాలి వీయ‌డంతో ఓడిపోయి.. వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఇక‌, ఇప్ప‌టికైనా.. వీరు పుంజుకుంటే.. పార్టీ మెరుగుప‌డే అవ‌కాశం మెండుగా ఉంది. ఇక‌, అధికార పార్టీ విష‌యానికి వ‌స్తే.. సంస్థాగ‌తంగా కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంకు వైసీపీకి క‌లిసివ‌చ్చింది.
అయితే.. బుట్టా రేణుక‌, ఎస్వీ మోహ‌న్‌రెడ్డి త‌దిత‌ర నేత‌ల‌కు పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోవ‌డం.. కొన్ని ఇబ్బందుల‌కు కార‌ణంగా ఉంది. ఇక‌, గెలిచిన వారిలోనూ.. కుటుంబ రాజ‌కీయాలు పెరిగిపోయాయి. దీంతో క‌ర్నూలులోనూ వైసీపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎదురుగాలి ఖాయం కాగా.. టీడీపీ ఇప్ప‌టి నుంచి పుంజుకుంటే త‌ప్ప‌.. ఆశించిన ఫ‌లితం ద‌క్క‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.