గ‌జ‌ప‌తుల విష‌యంలో వైఎస్‌కు జ‌గ‌న్‌కు ఎంత తేడా?

టీడీపీ కీల‌క నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి.. అశోక్ గ‌జ‌ప‌తిరాజుతో వైసీపీ స‌ర్కారు చేస్తున్న యుద్ధం ఎప్పుడు ఆగుతుంది? ఇది ఎన్నాళ్లు సాగుతుంది? ఎక్క‌డ ముడి ప‌డుతుంది? ఇదీ ఇప్పుడు కేవ‌లం ఉత్త‌రాంధ్ర వ‌ర్గాల‌నే కాకుండా.. టీడీపీలోను, రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌.

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను అణిచేయ‌వాల‌నేది ఒక వ్యూహం ప్ర‌కారం సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అనేక మంది మాజీ మంత్రుల‌పై అవినీతి కేసులు, ఇత‌ర‌త్రా ఆరోప‌ణ‌లు ఉన్నాయంటూ.. జ‌గ‌న్ స‌ర్కారు కేసులు న‌మోదు చేయ‌డం.. కొంద‌రిని జైళ్ల‌కు కూడా పంపించ‌డం తెలిసిందే.

అయితే.. ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో మంచి ప‌లుకుబ‌డి.. ప్ర‌జాద‌ర‌ణ ఉన్న అశోక్‌పై మాత్రం మ‌రో రూపంలో క‌సి తీర్చుకుంటున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మంచి ప‌ట్టున్న అశోక్‌ను నైతికంగా దెబ్బ‌తీయాల‌నే కుట్ర కోణం ఖ‌చ్చితంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర వైసీపీ నాయ‌కుడు.. ఎంపీ సాయిరెడ్డికి బ‌ల‌మైన కోట‌గా మార్చే వ్యూహంలో జ‌గ‌న్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని.. ఈ క్ర‌మంలోనే అశోక యుద్ధానికి తెర‌దీశార‌ని అంటున్నారు. మాన్సాస్ ట్ర‌స్టు అనేది పూస‌పాటి ఫ్యామిలీకి ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చిన హ‌క్కుకాదు. త‌రాలుగా వారు ట్రస్టీలుగా ఉన్నారు.

వీలునామాలు, ద‌స్తావేజులు.. స‌హా.. అన్నీ స‌వివ‌రంగా ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ.. మాన్సాస్ ట్ర‌స్ట్‌లో స‌ర్కారు వేలు పెట్టింది. వాస్త‌వానికి జ‌గ‌న్ క‌న్నా ఎక్కువ‌గా గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి టీడీపీ నేత‌ల‌పై దృష్టిపెట్టార‌నే ప్ర‌చారం ఉంది. అయినా.. ఆయ‌న అశోక్ విష‌యంలో మాన్సాస్‌ను బూచిగా చూపించి.. ఎక్క‌డా రాజ‌కీయం చేయ‌లేదు.

ఈ జిల్లాకు చెందిన బొత్స స‌త్య‌నారాయ‌ణ కు అధిక అధికారాలు అప్ప‌గించి.. మంత్రిని చేసి.. రాజ‌కీయంగా దూకుడు చూపించారే త‌ప్ప‌.. నైతికంగా అశోక్‌పై చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌లేదు. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ మాత్రం అశోక్ విష‌యంలో చాలా వ్యూహాత్మ‌కంగా ఆయ‌న‌ను నైతికంగా దెబ్బ‌కొట్టి.. ఇక్క‌డ వైసీపీ పాగా వేయాల‌ని అనుకుంటున్న‌ట్టు పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.

ఇప్ప‌టికే మాన్సాస్ వ్య‌వ‌హారంలో హైకోర్టు తీర్పు ఇవ్వ‌డంతో ప్ర‌భుత్వం ఆద‌రాబాద‌రాగా అర్ధ‌రాత్రి తీసుకువ‌చ్చి ట్ర‌స్ట్ ప‌గ్గాలు అప్ప‌గించిన సంచ‌యిత‌..ప‌క్క‌కు త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. ఆ వెంట‌నే అశోక్ త‌న అధికారం చేప‌ట్టారు.

అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌భుత్వం హైకోర్టును ఆశ్ర‌యించింది. పైగా.. ట్ర‌స్ట్ లావాదేవీలంటూ.. ఓ పాతికేళ్లు వెన‌క్కి వెళ్లి.. అవినీతిని త‌వ్వి తీసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే.. ఇవ‌న్నీ కూల్‌గా గ‌మ‌నిస్తున్న అశోక్‌.. న్యాయ‌ప‌రంగానే పోరాడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ అశోక యుద్ధం ఎప్ప‌టికి ఎండ్ అవుతుంది? అనేది కీల‌క‌ప్ర‌శ్న‌.