పురందేశ్వ‌రికి వ‌ర్క‌వుట్ కావ‌ట్లేదా? రీజ‌నేంటి?

అన్న‌గారి గారాల‌ప‌ట్టి, కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్నారు. అయితే.. ఆమెకు అనుకున్న రేంజ్‌లో పార్టీ ఫాలోయింగ్ క‌నిపించ‌డం లేదు. కీల‌క నేత‌లు ఆమెతో డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి రీజ‌నేంటి? అనేది ఆస‌క్తిగా మారింది. గ‌తంలో కాంగ్రెస్ రాజ‌కీయాల్లో ముఖ్యంగా వైఎస్ ఆశీస్సుల‌తో బాగానే చ‌క్రం తిప్పిన పురందేశ్వ‌రి. విశాఖ ఎంపీగా కూడా విజ‌యంద‌క్కించుకుని, కేంద్రంలో మంత్రి పీఠం కూడా పొందారు. విశాఖ‌ను త‌నకు ఆత్మీయ నియోజ‌క‌వ‌ర్గంగా చెప్పుకొనే ఆమెకు.. ఇప్పుడు ఈవిశాఖ కూడా దూర‌మైంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసిన ఆమె ప‌రాజ‌యం పాల‌య్యారు.

ప్ర‌స్తుతం బీజేపీ కేంద్ర క‌మిటీ స‌భ్యురాలిగా ఉన్న పురందేశ్వ‌రిని రాష్ట్ర నేత‌లు ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదనే టాక్ వినిపిస్తోంది. జీవీఎల్ కానీ, రాష్ట్ర పార్టీ చీఫ్ సోము వీర్రాజు కానీ.. ఇత‌ర‌త్రా నేత‌లు కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక స‌మ‌యంలో పురందేశ్వ‌రి కేవ‌లం మీడియా మీటింగుల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ప్ర‌చారం నిర్వ‌హించేందుకు పెద్ద‌గా ఉత్సాహం చూపించ‌లేదు. ఆమె క‌నుక ప్ర‌య‌త్నం చేసి ఉంటే.. అన్నగారి సానుభూతిప‌రులు త‌మ‌కు ఓట్లు వేసి వుండేవార‌ని బీజేపీనేత‌ల మ‌ధ్య కొన్నాళ్లు చ‌ర్చ న‌డిచింది. ఈ క్ర‌మంలోనే ఆమె త‌మ‌కు ఎలానూ స‌హ‌క‌రించ‌డం లేద‌ని నిర్ణ‌యించుకున్నారా? అనే సందేహం వ్య‌క్తం అవుతోంద‌ని బీజేపీ నేత‌ల మ‌ధ్య గుస‌గుస వినిపిస్తోంది.

పురందేశ్వ‌రి.. విశాఖ‌పై ప‌ట్టు పెంచుకునేందుకు కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు ప్ర‌య‌త్నించారు. అయితే.. అప్ప‌ట్లో కంభం పాటి హ‌రిబాబు వ‌ర్గం.. ఆమెకు స‌హ‌క‌రించ‌లేద‌నే వాద‌న ఉంది. ఎందుకంటే.. హ‌రిబాబు వ‌ర్గం అంటే.. జాతీయ నేత‌లుగా ఉన్న కొంద‌రితో ముడిప‌డిన వ్య‌వ‌హారం. వారికి పురందేశ్వ‌రి గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్ప‌టి నుంచి కూడా ప‌డేది కాదు. ఈ నేప‌థ్యంలోనే హ‌రిబాబు వ‌ర్గం దూరం పెట్టింది. ఈ ప్ర‌భావ‌మే గ‌త ఎన్నిక‌ల్లో పురందేశ్వ‌రి బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోవ‌డానికి దారితీసిందనే విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. అయితే.. ఇప్పుడు కంభం పాటి హ‌రిబాబు.. ఈశాన్య రాష్ట్ర‌మైన మిజోరాం.. రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్‌కు వెళ్ల‌నున్నారు. దీంతో ఇక్క‌డ బీజేపీకి నేత లోటు క‌నిపిస్తోంది.

దీనిని ఫిల‌ప్ చేయాల‌ని పురందేశ్వ‌రి భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే.. ఇక్క‌డ కూడా ఆమెకు చిక్కులు ఎదుర‌వుతున్నా యి. ఒక‌టి ఇటీవ‌ల జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పురందేశ్వ‌రి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. క‌నీసం పార్టీ త‌ర‌ఫున విశాఖ‌లో ప్ర‌చారం కూడా నిర్వ‌హించ‌లేదు. అదేస‌మ‌యంలో ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఎంఎల్ ఎన్ మాధ‌వ్‌.. ఉత్త‌రాంధ్ర‌పై ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నిస్తు న్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుస్తూ.. పాద‌యాత్ర‌లు చేస్తూ..అంద‌రిలోనూ క‌లివిడిగా ఉన్నారు. ఈయ‌న కూడా విశాఖ‌పై ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో పురందేశ్వ‌రికి బీజేపీలో వ‌ర్క‌వుట్ కావ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే.. ఆమె మాత్రం సైలెంట్‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.