15 కేజీలు బరువు పెరిగిన హీరోయిన్

కృతి సనన్.. ప్రస్తుతం బాలీవుడ్లో హ్యాపెనింగ్ హీరోయిన్లలో ఒకరు. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’లో ఆమే కథానాయికగా. ప్రభాస్ ప్రధాన పాత్రలో ఓం రౌత్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో కృతి సీత పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ పాత్రకు సూటయ్యే బడా హీరోయిన్లు చాలామంది ఉండగా.. ఓం రౌత్ మాత్రం కృతికే ఆ పాత్రను కట్టబెట్టాడు.

బాలీవుడ్లో చిన్న సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టి ఈ స్థాయికి చేరుకోవడంలో కృతి కష్టం చాలానే ఉంది. ‘ఆదిపురుష్’ కంటే ముందు ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాతో కృతి పలకరించబోతోంది. అదే.. మిమీ. ఈ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్నట్లు కూడా చాలామంది ప్రేక్షకులకు తెలియదు. సైలెంటుగా సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశారు. తాజాగా రిలీజైన ‘మిమీ’ ట్రైలర్ భలే ఫన్నీగా ఉండి ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది.

మంగళవారం ట్రైలర్ వచ్చినప్పటి నుంచి యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇందులో ఒక విదేశీ జంట కోసం సరోగసీ ద్వారా బిడ్డను కనడానికి సిద్ధమయ్యే మధ్య తరగతి అమ్మాయిగా కృతి కనిపిస్తోంది. ఐతే ట్రైలర్లో చూస్తే మునుపటి సినిమాలతో పోలిస్తే కృతి కొంచెం బొద్దుగా కనిపిస్తోంది. ప్రెగ్నెంట్ అయినపుడు అమ్మాయిలు బరువు పెరిగి బొద్దుగా తయారవుతారన్న సంగతి తెలిసిందే.

కృతి ఒరిజినల్ అవతారంలో ఈ పాత్ర చేస్తే సూట్ కాకపోయేది. కానీ ప్రెగ్నెంట్‌గా కనిపించడం కోసం ఆమె బాగా బరువు పెరిగింది. మొత్తం 15 కేజీల వెయిట్ గెయిన్ చేసిందామె. ఎంత పాత్ర డిమాండ్ చేసినా కూడా ఐదారు కిలోలు బరువు పెరగడానికి ఓకే కానీ.. హీరోయిన్లు ఒకేసారి 15 కిలోల బరువు పెరగాలి అంటే అలాంటి పాత్రలు తమ వల్ల కాదనేస్తారు.

కానీ కృతి మాత్రం ధైర్యంగా ఈ క్యారెక్టర్ కోసం ఆ సాహసం చేసింది. ఏమాటకు ఆమాటే చెప్పాలి కానీ.. కొంచెం ఒళ్లు చేశాక కృతిలో ఆకర్షణ పెరిగింది. ‘మిమీ’ ఆమె కెరీర్లో ఒక మైలురాయి అవుతుందని అంచనా వేస్తున్నారు.