టీ టీడీపీకి సెగ పెడుతున్న కోవ‌ర్టు రాజ‌కీయం

తెలంగాణ టీడీపీకి పెద్ద స‌మ‌స్య వెంటాడుతోంది. పార్టీ నేత‌ల్లో ఎవ‌రిని న‌మ్మాలో ఎవ‌రిని న‌మ్మకూడదో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేలు… చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులు. అయితే.. వారు అధికార‌పార్టీకి కోవ‌ర్టులుగా ప‌నిచేశార‌నే విమ‌ర్శ‌లు అప్ప‌ట్లోనే వినిపించాయి.

ఇక‌, ఈ క్ర‌మంలోనే వారిద్ద‌రూ పార్టీ మారి.. కారెక్క‌డం తెలిసిందే. ఇక‌, ఇటీవ‌ల పార్టీ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ కూడా సైకిల్ దిగి కారెక్కారు. నిజానికి ఈయ‌నకు పార్టీలో చంద్ర‌బాబు.. భారీ ఛాన్సులే ఇచ్చారు. త‌న కేబినెట్‌లో మంత్రిగా అవ‌కాశం ఇచ్చారు.

ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇచ్చి గౌర‌వించారు. అంతేకాదు.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించి..తెలంగాణ‌ రాష్ట్రానికి టీడీపీ అధ్య‌క్షుడిగా కూడా నియ‌మించారు. మ‌రి ఇంత చేస్తే.. ఎల్‌. ర‌మ‌ణ చేసింది ఏంటి? అనేది ప్ర‌శ్న‌.

ఇన్నేళ్ల‌లో ఏనాడూ.. ర‌మ‌ణ నోరు విప్పి మాట్లాడింది లేదు. ఒక బ‌హిరంగ వేదిక‌పై… పార్టీ వాయిస్ వినిపించి.. బ‌లోపేతం చేసింది కూడా క‌నిపించ‌దు. పైగా అధికార పార్టీలో కీల‌క నేత‌ల‌తో ముఖ్యంగా టీడీపీ నుంచి వెళ్లి టీఆర్ఎస్‌లో చేరిన వారితో చేతులు క‌లిపార‌ని.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా.. చంద్ర‌బాబు ర‌మ‌ణ‌కు అవ‌కాశం ఇస్తూనే ఉన్నారు.

కానీ, తాజాగా ర‌మ‌ణ మాత్రం కీల‌క స‌మయం లో టీడీపీని విడిచి పెట్టి వెళ్లిపోవ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. ఇక‌, ఇప్పుడు ఎవ‌రికి ప‌గ్గాలు అప్ప‌గించాల‌న్నా.. ఒక‌టికి రెండు సార్లు ఆలోచించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. నిజానికి చాలా మంది సీనియ‌ర్లు ఉన్నారు. అయితే.. ఎవ‌రికి ప‌గ్గాలు అప్ప‌గించాల‌న్నా.. పార్టీని ముందుకు తీసుకువెళ్లే నాయ‌కులు ఉండాలి త‌ప్ప‌.. పార్టీలోనే ఉంటూ.. ర‌మ‌ణ మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తే ఎలా ? అనేది మిలియ‌న్ డాల‌ర్ల‌ ప్ర‌శ్న‌గా మారింది. ప్ర‌స్తుతం బీసీ, ఓసీ సామాజిక వ‌ర్గాల్లో పార్టీకి బ‌ల‌మైన నాయ‌కులు ఎవ‌రు ఉన్నారు? అనే విష‌యం పై చంద్ర‌బాబు దృష్టి పెట్టారు.

ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేరకు ఈ ద‌ఫా రెడ్డిసామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది.ఎందుకంటే.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో రెడ్డి సామాజిక వ‌ర్గ‌మే కీల‌కంగా ఉంది. ఈ క్ర‌మంలో రెడ్డి వ‌ర్గ‌మైతే.. పార్టీకి మేలు జ‌రుగుతుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో సీనియ‌ర్ నాయ‌కుడు రావుల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, కొత్త‌కోట ద‌యాక‌ర్ రెడ్డిల పేర్ల‌ను చంద్ర‌బాబు ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే..ఎవ‌రిని నియ‌మించినా..పార్టీలో అంకిత భావంతో ప‌నిచేసేవారు కావాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అంతేత‌ప్ప‌.. కోవ‌ర్టులుగా ఉంటూ.. పార్టిని భ్ర‌ష్టుప‌ట్టించేవారు కాద‌ని ఆయ‌న త‌ల‌పోస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు తెలంగాణ టీడీపీ అధ్య‌క్ష ఎంపిక‌పై ఆచితూచి అడుగులు వేస్తున్నారు.