అనుష్క సినిమా క్యాన్సిల్ అయిందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క చివరిగా నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మూగ, చెవిటి పాత్రలో అనుష్క లీనమై నటించినప్పటికీ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా తరువాత ఆమె మరో సినిమా ఒప్పుకోలేదు. అయితే కొన్ని రోజులుగా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి అనుష్క ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

మహేష్ పి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తీయాలనుకున్నారు. త్వరలోనే అనౌన్స్మెంట్ వస్తుందని అభిమానులు ఎదురుచూశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోయిందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మేకర్స్ లో పునరాలోచన మొదలైందట. అందుకే ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించలేదట.

సరైన కారణాలు తెలియనప్పటికీ.. ప్రస్తుతానికైతే ఈ సినిమాను పక్కన పెట్టినట్లు సమాచారం. అనుష్కకి కూడా ఇప్పట్లో సినిమా చేసే ఆలోచన లేదని తెలుస్తోంది. మరింత సమయం గ్యాప్ తీసుకోవాలని అనుకుంటుంది. ఇక నవీన్ పోలిశెట్టి ‘జాతిరత్నాలు’ సినిమాతో ప్రేక్షకులను అలరించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. తన సినిమాలకు సంబంధించి రకరకాల వార్తలు వస్తుండడంతో.. ఏ సినిమా అయినా.. తనే స్వయంగా వెల్లడిస్తానని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశాడు.