ష‌ర్మిల క‌న్నీరు.. సెంటిమెంటు పాలిటిక్స్ పీక్స్‌!

సెంటిమెంటు ప్రాతిప‌దిక‌గా న‌డుస్తున్న తెలంగాణ రాజ‌కీయాల్లో వైఎస్సార్ తెలంగాణ‌పార్టీ అధ్య‌క్షురాలు.. ష‌ర్మిల‌.. మ‌రింత సెంటిమెంటును ర‌గిలించేందుకు ప్ర‌య‌త్నించారు. తాజాగా ఆమె.. క‌న్నీరు పెట్టుకున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాజ‌న్న పేరుతో సెంటిమెంటును ర‌గిలించేందుకు చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌క‌పోవ‌డంతోనే ఇప్పుడు క‌న్నీటి రాజ‌కీయాల‌కు ష‌ర్మిల తెర‌దీసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. తెలంగాణలోని వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తాడిపర్తిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించారు.

నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్య చేసుకున్న కొండల్ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ పరిస్థితులు.. ఆత్మహత్యకు దారితీసిన కారణాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. కుమారుని మృతితో గుండెలవిసేలా రోదిస్తున్న వారిని షర్మిల ఓదార్చారు. ఈ క్ర‌మంలోనే షర్మిల కంటతడి పెట్టారు. అనంతరం కొండల్ ఇంటి నుంచి తాడిపర్తి బస్టాండ్కు నడుచుకుంటూ ర్యాలీగా వెళ్లారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా, నిరాహార దీక్ష వారంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వారంగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు.

నిరుద్యోగులు ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో లక్షా 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 50వేల ఉద్యోగాలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసే వరకు తమ పోరాటం ఆగదని వెల్లడించారు.

నిరుద్యోగులకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. తాడిపర్తిలో రోజంతా నిరాహార దీక్ష చేయనున్నట్లు స్పష్టం చేశారు. అయితే.. ష‌ర్మిల క‌న్నీళ్లు.. కేవ‌లం రాజ‌కీయం కోసమేన‌ని.. ఏపీలో ప‌రిస్థితి కూడా ఇలానే ఉంద‌ని, అక్క‌డ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డెక్కుతుంటే.. ప్ర‌భుత్వం అరెస్టు చేయించి.. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తున్న వైనం.. ష‌ర్మిల‌కు క‌నిపించ‌డం లేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనికి ష‌ర్మిల ఎలాంటి ఆన్స‌ర్ ఇస్తారో.. చూడాలి.