మాస్ రాజా.. ఈ గిల్లుడేంది?


టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు, మాస్ రాజా రవితేజకు ఒకరంటే ఒకరికి పడదని.. వీళ్లిద్దరి మధ్య ఏదో గొడవ ఉందని సోషల్ మీడియాలో తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఒక హీరోయిన్ విషయమై ఇద్దరికీ ఏదో వివాదం నడిచినట్లుగా చెబుతుంటారు. ఆ సంగతలా వదిలేస్తే.. బాక్సాఫీస్ దగ్గర వీరి మధ్య కొన్ని ఆసక్తికర సమరాలు జరిగాయి. వివిధ సమయాల్లో ఒక్కమగాడు-కృష్ణ.. మిత్రుడ-కిక్.. పరమవీరచక్ర-మిరపకాయ్.. ఇలా ఈ ఇద్దరి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. ప్రతిసారీ బాలయ్యపై రవితేజనే పైచేయి సాధించాడు.

ఈ ఏడాది మరోసారి బాలయ్య, రవితేజ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడాల్సింది. మే 28న వీరి చిత్రాలు అఖండ, ఖిలాడి విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే పంతంతోనే ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర పోటీకి రెడీ అయ్యారంటూ ఆ మధ్య అందరూ ఆసక్తిగా చర్చించుకున్నారు. కానీ ఆ పోటీ సాధ్యపడలేదు.

ఐతే ఇప్పుడు రవితేజ కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించిన నేపథ్యంలో మరోసారి బాలయ్య-రవితేజ వైరం తెరపైకి వచ్చింది. కొన్నేళ్ల కిందట బాలయ్య ‘రామారావు’ పేరుతో ఓ సినిమా చేయాలనుకున్నాడు. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఏవో కారణాల వల్ల ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఐతే రామారావు అనేది మంచి టైటిల్. పైగా బాలయ్య తండ్రి పేరది. దీంతో తర్వాత అయినా బాలయ్యే ఈ పేరుతో సినిమా చేస్తాడని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు రవితేజ ఆ టైటిల్ వాడుకుని ఆశ్చర్యానికి గురి చేశాడు.

శరత్ మండవ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న చిత్రానికి ఈ టైటిల్ పెట్టేయడం చర్చనీయాంశం అయింది. బాలయ్యను గిల్లడానికి రవితేజ కావాలనే ఈ టైటిల్ పెట్టాడని కొందరంటుంటే.. అందుబాటులో ఉన్న ఏ టైటిలైనా ఎవరైనా వాడుకోవచ్చని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరి రవితేజ ఉద్దేశమేంటో.. ఈ టైటిల్‌ను అతను వాడుకోవడంపై బాలయ్య ఎలా స్పందిస్తాడో చూడాలి.