‘రాజు’గారి ఇలాకాలో రాజ‌కీయ ఒడిదుడుకులు!

టీడీపీకి ఇదో విప‌త్క‌ర ప‌రిస్థితి! అత్యంత కీల‌క‌మైన విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పార్టీని న‌డిపించే నేత లేకుండా పోయార‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కీల‌క నేత‌గా.. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అయితే.. ఈయ‌న ఇటీవ‌ల కాలంలో కొంత అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పో యిన త‌ర్వాత ఏడాది పాటు ఆయ‌న ఢిల్లీలో ఉండి.. చికిత్స తీసుకున్నారు. పోనీ ఆత‌ర్వాతైనా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు చేరువ అయ్యారా? అంటే.. మాన్సాస్ స‌మ‌స్య ముందుకు రావ‌డంతో దాంతోనే ఉండిపోయారు.

ఇక‌, ఈ విష‌యం తేలే లోపు.. రాష్ట్రంలో క‌రోనా తొలి, రెండో ద‌శ‌ల‌తో అశోక్ రాజ‌కీయంగాయాక్టివ్ లేకుండా పోయారు. వ‌ర్చువ‌ల్ గా కొన్ని మీడియాల‌కు బైట్లు ఇస్తున్నా.. ఆయ‌న ప్ర‌భావం జిల్లా పార్టీపై క‌నిపించ‌డం లేదు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు.

ఇక‌, పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కొన్నాళ్ల‌పాటు ఆయ‌న కుమార్తె అదితి గ‌జ‌ప‌తి రాజు(గ‌త ఎన్నిక‌ల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు) ప్ర‌య‌త్నించారు. కానీ, కొన్నాళ్ల‌కు కుటుంబ ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌తో ఆమె కూడా దూరంగా ఉంటున్నారు. ఒకానొక ద‌శ‌లో అశోక్ త‌ర్వాత‌.. అదితి జిల్లా టీడీపీలో నెంబ‌ర్ 1 అవుతార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఆమె వ్య‌క్తిగ‌త కుటుంబ కార‌ణాల‌తో ఇప్పుడు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు.

మ‌రోవైపు వైసీపీ నుంచి వ‌చ్చి.. టీడీపీలో చేరి, మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టిన బొబ్బిలి వంశీయులు సుజ‌య్ కృష్ణ రంగారావు ఆచూకీ ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న అసలు రాజ‌కీయాల్లో ఉన్నారో లేదో కూడా తెలియ‌డం లేదు. ఎదిగేందుకు .. పార్టీని పుంజుకునేలా చేసేందుకు ఉన్న స్కోప్‌ను ఈయ‌న స‌రిగా వినియోగించుకోక‌పోగా.. అస‌లు రాజ‌కీయాల్లో ఉన్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మయ్యేలా చేస్తోంది. మ‌రికొంద‌రు నేత‌లు.. వైసీపీ కీల‌క నాయ‌కుడు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారు. లోకేష్‌ ఫోన్ల‌కు కూడా స్పందించ‌డం లేద‌ని తెలుస్తోంది.

ఇలా… విజ‌య‌న‌గ‌రం టీడీపీలో పేరు గొప్ప నేత‌లు చాలా మంది ఉన్న‌ప్ప‌టికీ.. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వులు అనుభ‌వించి.. అధికారంలో ఉన్న‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయ‌కులు మౌనంగా ఉంటున్నారు. పార్టీలో ఉన్నారంటే ఉన్నార‌నేవారు కొంద‌రు అయితే.. అస‌లు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియ‌ని వారు కొంద‌రు.. అన్న‌ట్టుగా విజ‌య‌న‌గ‌రం టీడీపీ ప‌రిస్థితి మారిపోయింది.

దీంతో ఇటు కార్య‌క‌ర్త‌ల‌కు, అటు పార్టీకి కూడా ఏమాత్రం ప్ర‌యోజ‌నం చూపించ‌లేక పోతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రో మూడేళ్ల‌లో ఎన్నిక‌లు ఉన్నాయి. వైసీనిని నిలువ‌రించి.. టీడీపీకి ప‌ట్టున్న జిల్లాలో పార్టీ ప‌తాకం రెప‌రెప‌లాడేలా చేయాల్సిన బాధ్య‌త‌, కార్య‌క‌ర్త‌ల్లో మ‌నో స్థ‌యిర్యం నింపే బాధ్య‌త ఎవ‌రు తీసుకుంటారో చూడాలి.