టార్గెట్ లోకేష్‌.. జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Lokesh

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్రంలో ఏపీ ఫైబ‌ర్ నెట్‌ ప‌థ‌కం అమ‌లులో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని.. దీనిపై నిగ్గు తేల్చాల‌ని ఆయ‌న సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో .. ఏపీ ఫైబ‌ర్ నెట్ అవ‌క‌త‌వ‌క‌ల‌పై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మేరకు సీఐడీకి ఆదేశాలిస్తూ.. ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కాంట్రాక్టర్‌కు అనుకూలంగా టెండర్లను ఖరారు చేశారని, ఈ అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగా కేసును సీఐడీకి అప్పగించారు.

అప్ప‌ట్లో ఏం జ‌రిగింది?

వాస్త‌వానికి ఏపీ ఫైబ‌ర్ నెట్‌పై విచార‌ణ‌కు ఆదేశించ‌డం వెనుక‌.. పూర్తిగా.. రాజ‌కీయ కోణం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. గ‌త చంద్ర‌బాబు పాల‌నలో ఐటీ మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న కుమారుడు నారా లోకేష్‌.. ఏపీ ఫైబ‌ర్ ఫైబ‌ర్ నెట్ వ్య‌వ‌హారాల‌ను చూశారు. అయితే.. ఆయ‌న గ్రామీణ స్థాయిలో దీనిని బ‌లోపేతం చేయ‌డంతోపాటు.. న‌గ‌రంలోనూ అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కే అంటే.. కేవ‌లం 140 రూపాయ‌ల‌కే ఈ ఫైబ‌ర్‌నెట్ ద్వారా అన్ని ఛానెళ్లు, ఇంట‌ర్‌నెట్‌, ఫోన్ స‌దుపాయం కూడా క‌ల్పించారు. ఈ ప్ర‌క్రియను వేగ‌వంతం చేయ‌డంలో లోకేష్ అప్ప‌ట్లో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై కేంద్ర మంత్రుల నుంచి కూడా ప్ర‌శంస‌లు అందుకున్నారు.

వైసీపీ నేత‌ల‌పై కేసులు

అయితే.. అప్ప‌ట్లోనే ఫైబ‌ర్‌నెట్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన వైసీపీ నాయ‌కులు.. అనేక న‌గ‌రాల్లో ఫైబ‌ర్ నెట్ వైర్ల‌ను క‌త్తిరించేయ‌డం.. వ్య‌వ‌స్థ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించేలా వ్య‌వ‌హ‌రించ‌డంపై చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. ప‌లువురిపై కేసులు కూడా న‌మోదు చేశారు. వీటిని సాక్ష్యాల‌తో స‌హా పోలీసులు సేక‌రించారు. అదే స‌మ‌యంలో ఫైబ‌ర్ నెట్‌లో అవినీతి జ‌రిగిపోయింద‌ని.. భారీ ఎత్తున దోచేశార‌ని కూడా సాయిరెడ్డి అప్ప‌ట్లో ఆరోపించారు. అయితే.. జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇవ‌న్నీ చిల్ల‌ర కేసుల‌ని, రాజ‌కీయ ప్రేరేపిత కేసుల‌ని పేర్కొంటూ.. తొలి ఏడాది చివ‌రిలోనే వాటిని త‌ప్పించారు.

టార్గెట్ ఎవ‌రు?

ఇక‌, ఇప్పుడు.. పాల‌న‌ప‌గ్గాలు చేప‌ట్టిన‌.. రెండేళ్ల త‌ర్వాత‌.. సీఎం జ‌గ‌న్‌కు ఫైబ‌ర్ నెట్ అవ‌క‌త‌వ‌క‌లు గుర్తుకు రావ‌డం చిత్రంగా అనిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదే స‌మ‌యంలో సాయిరెడ్డి అప్ప‌ట్లోనే మంత్రిగా ఉన్న లోకేష్‌పై ఫైబ‌ర్‌నెట్ ఆరోప‌ణ‌లు చేసినా.. త‌ర్వాత దీనిపైనా సైలెంట్ అయ్యారు. దీంతో ఆరోప‌ణ‌ల‌కు బ‌లం లేద‌ని.. రాజ‌కీయంగా వ్యాఖ్య‌లు వినిపించాయి. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా మ‌రోసారి.. ఫైబ‌ర్ నెట్ లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని పేర్కొంటూ.. సీఐడీని ఆదేశించ‌డం వెనుక‌.. ఖ‌చ్చితంగా లోకేష్‌ను టార్గెట్ చేస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

లోకేషే.. ఎందుకు?

ఇప్పుడు టీడీపీ యువ నాయ‌కుడిగా.. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఇటీవ‌ల కాలంలో ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక‌, విద్యార్థి, ఉద్యోగ వ్య‌తిరేక నిర్ణ‌యాల‌పై లోకేష్ బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి అవ‌కాశం వ‌చ్చినా.. ఆయ‌న ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డుతున్నారు. నిరంత‌రం జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నారు. విద్యార్థుల ప‌రీక్ష‌లు, పాఠ‌శాల‌లు తిరిగి తెర‌వ‌డం, ఎస్సీల‌పై దాడులు, ఇలా ప్ర‌తి విష‌యంలోనూ జ‌గ‌న్‌ను నిల‌దీస్తున్నారు. ఈ క్ర‌మంలో బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్న నాయ‌కుడిగా లోకేష్‌కు క్రేజ్ పెరుగుతోంది. దీంతో ఏదో ఒక విధంగా ఈ గొంతును అణిచేయాల‌నే వ్యూహం నేప‌థ్యంలోనే జ‌గ‌న్ స‌ర్కారు ఇప్పుడు ఫైబ‌ర్ నెట్‌లో అక్ర‌మాలంటూ.. కొత్త పాట‌కు గొంతు విప్పింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.