చినబాబు కోసం.. బాబు ముందు జాగ్ర‌త్త‌

టీడీపీ రాజ‌కీయాలు మారుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కీల‌కంగా ఉన్న నాయ‌కులు ఇప్పుడు చాలా మంది తెర‌మ‌రుగ‌య్యారు. అదే స‌మ‌యంలో కొంద‌రు కీల‌కంగా మారారు. దీంతో ఇప్పుడు టీడీపీలో రాజ‌కీయ రంగు పూర్తిగా మారుతోంద‌నే వాద‌న బ‌లంగా ఉంది. ముఖ్యంగా చంద్ర‌బాబుతో పాటు.. లోకేష్‌ను స‌మ‌ర్థించేవారికే పార్టీలో పెద్ద పీట ప‌డుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నాయ‌కుల్లో చాలా మంది చంద్ర‌బాబును స‌మ‌ర్థించేవారు ఎక్కువ‌గా ఉన్నారు. వీరిలో సీనియ‌ర్లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. పార్టీ ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుంచి ఉన్న సీనియ‌ర్లు బాబుకు భ‌జ‌న చేస్తుండ‌డంతో వారినే కంటిన్యూ చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి.

అయితే.. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి చంద్ర‌బాబు త‌న కుమారుడు లోకేష్‌ను హైలెట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌నే కీల‌కంగా మార‌నున్నారు. ఈ నేప‌థ్యంలో లేకేష్ సెంట్రిక్‌గా రాజ‌కీయాలు చేసే వారికి ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల పోస్టుల‌ను రివైజ్ చేసి.. కొత్త‌గా యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తార‌ని తెలుస్తోంది.

విజ‌య‌వాడ నుంచి కొమ్మారెడ్డి ప‌ట్టాభి ప్ర‌తినిధిగా ఉన్నారు. ఇక‌, రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌రిటాల శ్రీరాం నేత‌గా కొన‌సాగుతున్నారు. శ్రీకాళ‌హ‌స్తి, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ యువ నేత‌లు ఉన్నారు. అదేవిధంగా ప్ర‌కాశం జిల్లాలోనూ యువ‌త‌ను ప్రోత్స‌హించి వారికి కూడా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల పోస్టులు ఇవ్వ‌డం ద్వారా వారి వాయిస్ బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు. ఇక్క‌డ ప‌మిడి ర‌మేష్, దామ‌చ‌ర్ల స‌త్య లాంటి వాళ్ల‌కు ప్రాధాన్యం పెర‌గ‌నుంది.

ఇక ఉత్త‌రాంధ్ర‌లో రామ్మోహ‌న్‌, అప్ప‌ల‌నాయుడు, విజ‌య్, అశోక్ లాంటి వాళ్ల‌కు ప్రాధాన్యం పెంచుతున్నారు. యువ నాయ‌కులు అయితే.. లోకేష్‌కు అనుకూలంగా ఉండ‌డంతోపాటు.. పార్టీలో లోకేష్‌ను స‌మ‌ర్థించే వారు కూడా ఉంటారు.

ఈ క్ర‌మంలో స‌మూల మార్పుల దిశ‌గా చంద్ర‌బాబు అడుగులువేస్తున్నారని.. ద‌స‌రా నాటికి సంపూర్ణంగా టీడీపీని యువ‌త చేతిలో పెట్ట‌నున్నార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీలో యువ‌త ప్రాధాన్యం పెరిగి.. లోకేష్ కు బూమ్ వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు ఆశ‌లు పెట్టుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.