‘ఆచార్య’ మల్టీస్టారర్ గా ఎలా మారింది..?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టి పరిస్థితులు నెమ్మదిగా మామూలు దశకు చేరుకుంటున్నాయి. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ‘ఆచార్య’ చివరి షెడ్యూల్ ను మొదలుపెట్టారు.

ఇదిలా ఉంటే అసలు ఈ సినిమా మల్టీస్టారర్ గా ఎలా మారిందనే దానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. నిజానికి కొరటాల శివ ఈ సినిమాలో మహేష్ బాబు కోసం గెస్ట్ రోల్ రాసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు కూడా నటించడానికి ఒప్పుకున్నారట. కానీ చాలా కాలంగా మంచి కథ దొరికితే తన కొడుకుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుందామనుకున్న చిరంజీవికి ‘ఆచార్య’ పెర్ఫెక్ట్ కథ అనిపించిందట.

అందుకే వెంటనే కొరటాల శివను పిలిపించి మహేష్ కి బదులుగా చరణ్ ను తీసుకోవాలని.. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా స్క్రిప్ట్ ను డెవలప్ చేయమని అడిగారట చిరు. మెగాస్టార్ అడిగేసరికి కాదనలేకపోయిన కొరటాల ఆయన చెప్పినట్లుగానే చరణ్ కోసం రోల్ ను మరింత పెంచి రాసుకున్నారు. కథ ప్రకారం సినిమాలో మెయిన్ ఎమోషన్స్ చరణ్ చుట్టూనే తిరుగుతాయని తెలుస్తోంది. సినిమాలో చరణ్ చేయాలనుకుని.. చేయలేకపోయిన దాన్ని ‘ఆచార్య’గా చిరంజీవి ఎలా కొనసాగించాడనేది స్టోరీ. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా కనిపించనున్నారు.