మహేష్ తో సినిమాపై మణిరత్నం కామెంట్స్!

మణిరత్నం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనతో సినిమాలు చేయాలని హీరోలందరూ ఆశపడుతుంటారు. కానీ తెలుగులో ఆయన స్ట్రెయిట్ సినిమాలు పెద్దగా తీయలేదు. అప్పుడెప్పుడో నాగార్జునతో ‘గీతాంజలి’ సినిమా తీశారు. ఇప్పటికీ ఆ సినిమా గురించి చెప్పుకుంటారు. ఆ తరువాత ఆయన ఇప్పటివరకు తెలుగులో మరో సినిమా డైరెక్ట్ చేయలేదు. మణిరత్నంని అభిమానించే మన హీరోలు ఆయనకు డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు.

ఆయన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవనో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ తెలుగు హీరోలు మాత్రం మణిరత్నంతో సినిమా అంటే వెనుకడుగు వేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో మణిరత్నం ఓ కథ పట్టుకొని టాలీవుడ్ స్టార్ హీరోల చుట్టూ తిరిగారు. కానీ మనవాళ్లు మాత్రం ముందుకు రాలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిశారు మణిరత్నం. వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి.

తాజాగా ఈ వార్తలపై స్పందించారు మణిరత్నం. మహేష్ ని కలిసిన మాట నిజమేనని.. ఆయనతో సినిమా కూడా చేయాలనుకున్నానని మణిరత్నం చెప్పారు. ఆయనతో కథా చర్చలు జరిగాయని.. కానీ కుదరలేదని అన్నారు. భవిష్యత్తులో మంచి కథ దొరికితే మహేష్ తో సినిమా చేస్తానని చెప్పారు. నాగచైతన్య, రామ్ లాంటి యంగ్ హీరోలను కూడా మణిరత్నం సంప్రదించారు. కాయి వాళ్లు కూడా నో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం మణిరత్నం ‘నవరస’ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. దీనికి ఆయన నిర్మాత మాత్రమే. నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.