రేవంత్ టేకాఫ్ బాగానే ఉంది కానీ…

కొత్తగా తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి టేకాఫ్ బాగానే ఉంది. చాలా కాలం తర్వాత పార్టీ ఆఫీసు గాంధీ భవన్లో మంచి జోష్ కనిపించింది. సీనియర్లలో కొందరు తప్ప చాలామంది హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడిన మాటలు, చేసిన హెచ్చరికలు, వేసిన సెటైర్లు బాగానే పేలాయి. మెజారిటి మీడియా కవరేజి కూడా బాగానే ఇచ్చింది.

ఇక్కడ విచిత్రమేమిటంటే మెజారిటి మీడియా యాజమాన్యాలు కాంగ్రెస్ కు వ్యతిరేకమైనా వ్యక్తిగతంగా రేవంత్ కు బాగా దగ్గర. అందుకనే రేవంత్ కార్యక్రమానికి అంతలా కవరేజి ఇచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే బాధ్యతల స్వీకరణ కార్యక్రమం టేకాఫ్ బాగానే జరిగింది. కానీ ఆ తర్వాత మాటేమిటి ? ఇపుడిదే రేవంత్ ముందున్న అతిపెద్ద సవాలు.

పార్టీలో బలమైన నాయకులైన కోమటిరెడ్డి సోదరులు రేవంత్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వీరిని ఏదో రకంగా దగ్గరకు చేర్చుకోవాల్సిన బాధ్యత కొత్త అధ్యక్షుడి మీదే ఉంది. వాళ్ళ అలక, సహాయనిరాకరణ రేవంత్ కు మంచిదికాదు. అలాగే మంచి ఇమేజున్న కరీంనగర్ జిల్లా నేత జీవన్ రెడ్డిని కూడా కలుపుకుని వెళ్ళాల్సిందే. తనంటే దూరంగా ఉంటున్న నేతలందరినీ రేవంత్ కలుపుకుని వెళ్ళగలిగితేనే భవిష్యత్తులో సక్సెస్ అవుతారు.

నిజానికి కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఎంతమంది కేసీయార్ కోవర్టులున్నారో ఎవరికీ తెలీదు. పార్టీలో కోవర్టుల విషయమై బాహాటంగానే చర్చ జరుగుతోంది. ఇటువంటి సమయంలో రేవంత్ నేతల విషయంలో ఆచుతూచి అడుగులేయాలి. కాబట్టి కేసీయార్ ను నూరుశాతం వ్యతిరేకించే నేతలెవరో రేవంత్ కు తెలిసే ఉంటుంది కాబట్టి వారిని కలుపుకుని వెళ్ళాల్సిందే. అపుడే మంచి టేకాఫ్ కు తగ్గ ఫలితం వస్తుంది.