ఏపీ మరీ అన్యాయమైపోయిందా ?

నరేంద్రమోడి దృష్టిలో ఏపి మరీ అన్యాయమైపోయినట్లుంది. లేకపోతే తమిళనాడు పార్టీ చీఫ్ ఎల్. మురుగన్ కు కేంద్రమంత్రిమండలిలో చోటు కల్పించిన మోడి ఏపి విషయాన్ని పూర్తిగా ఎందుకు వదిలేస్తారు ? బీజేపీకి సంబంధించి తమిళనాడు కన్నా ఏపినే కాస్త మెరుగనే చెప్పాలి. ఎందుకంటే బీజేపీ గాలి బలంగా వీచినపుడు ఏపిలో ఒకటో రెండో ఎంపి సీట్లలో గెలిచిన చరిత్ర కమలంపార్టీకుంది. తమిళనాడులో అసలు బోణీనే కొట్టలేదు దశాబ్దాల పాటు.

ఇపుడు కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మురుగన్ కూడా తమిళనాడు పార్టీ చీఫ్ మాత్రమే. లోక్ సభ కాదు కదా కనీసం రాజ్యసభ ఎంపి కూడా కాదు. ఏ సభలోను ఎంపిగా కూడా కనీ మురుగన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కాబట్టి తొందరలోనే ఏదో రాష్ట్రం నుండి మురుగన్ను రాజ్యసభకు పంపాల్సుంటుంది. అసలు ఎంపినే కాని వ్యక్తిని తన మంత్రివర్గంలోకి తీసుకున్న మోడి పార్టీలో ఐదుగురు తెలుగు వాళ్ళు రాజ్యసభ ఎంపిలుగా ఉన్నా ఎందుకని తీసుకోలేదు ?

2019 ఎన్నికల ఫలితాలు రాగానే మోడి సర్కార్ మరింత మెజారిటితో రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇదే సమయంలో రాష్ట్రంలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దాంతో పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపిలు బీజేపీలోకి ఫిరాయించారు. వీరిలో గరికపాటి మోహన్ రావు తెలంగాణా వ్యక్తయితే మిగిలిన ముగ్గురు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ ఏపికి చెందిన వారే.

ఒకవేళ వీళ్ళల్లో ఎవరు పనికిరారని అనుకున్నా ఉత్తర ప్రదేశ్ నుండి ఎంపికైన తెలుగు నేత జీవీఎల్ నరసింహారావు ఉండనే ఉన్నారు. ఏపి నుండి మంత్రివర్గంలోకి తీసుకోవటానికి ఇంత అవకాశం ఉండి కూడా ఎవరినీ తీసుకోలేదంటే మోడి దృష్టిలో ఏపి జీరో అనే అర్ధమైపోతోంది. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకున్నా లేదా ఎవరినీ తీసుకోకపోయినా బీజేపీకి వచ్చే లాభమూ లేదు కొత్తగా రాబోయే నష్టమూ లేదని మోడికి అర్ధమైపోయినట్లుంది. అందుకనే మోడి ఏపిని పూర్తిగా పక్కన పెట్టేశారు.