రాజధానిపై కేంద్రం తాజా నిర్ణయం ఇదేనా ?

ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న తాజా పరిణామాలను గమనిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా ? అవుననే సమాధానం వస్తోంది. కేంద్రం-రాష్ట్రం మధ్య జరుగుతున్న కరెస్పాండెన్స్ లో ఎక్కడా రాజధాని అమరావతి అని కేంద్రం ప్రస్తావించటంలేదట. ఏ కరెస్పాండెన్స్ లో చూసినా ఏపి అమరావతికి బదులుగా ఏపి రాజధాని హైదరాబాద్ అనే కనిపిస్తోందట.

చైతన్యకుమార్ రెడ్డి అనే వ్యక్తి కేంద్రాన్ని సమాచార హక్కు చట్టం క్రింద ఏపి రాజధానిపై సమాచారం అడిగారట. దానికి సమాధానంగా జగన్ ప్రస్తావించిన మూడు రాజధానులనే సమాధానంగా చెప్పింది. అలాగే అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల్లోనే అమరావతి అనే పేరును కేంద్రం ఉపయోగించటం లేదని అర్ధమైపోయింది. దీనిబట్టి వైజాగును రాజధానిగా కేంద్రం గుర్తించిందన్న విషయం తెలిసిపోతోంది.

ఎలాగూ మూడు రాజధానులను కేంద్రం గుర్తించింది కాబట్టి కర్నూలుకు హైకోర్టు తరలింపు కోసం తొందరలోనే రీ నోటిఫికేషన్ రావటం ఖాయమని తేలిపోయింది. హైకోర్టు తరలింపుకు కేంద్రం రీ నోటిఫికేషన్ జారీ చేయటం కోసమే జగన్ వెయిట్ చేస్తున్నారు. కేంద్రం గనుక ఆపని చేసేస్తే వెంటనే పరిపాలనా రాజధాని వైజాగ్ కు వెళ్ళిపోతారు. అప్పుడు అమరావతి శాసనరాజధానిగా మాత్రమే కంటిన్యు అవుతుంది.

నిజానికి మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. రాష్ట్రాల రాజధానుల నిర్ణయం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని అప్పట్లోనే కేంద్ర న్యాయశాఖ చాలా స్పష్టంగా ఒకటికి మూడుసార్లు అఫిడవిట్లు ఇచ్చింది. తాజా వైఖరితో అమరావతిని కేంద్రం రాజధానిగా గుర్తించటం లేదని స్పష్టమైపోయింది.