తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల డేటా తీసిన జగన్

కొద్ది రోజులుగా తెలుగురాష్ట్రాల మధ్య జల జగడాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఒక రాష్ట్రంలో నిర్మిస్తున్న నీటి ప్రాజెక్టులపై మరో రాష్ట్రం ఫిర్యాదు చేస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణపై తెలంగాణా ప్రభుత్వం కేంద్రానికి, సీడబ్ల్యూసీతో పాటు కృష్ణా రివర్ బేసిన్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబి)లకు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఇదే విధంగా తెలంగాణాలోని అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలపై ఏపి కూడా నరేంద్రమోడి, జలవనరుల శాఖతో పాటు అనేక సంస్ధలకు ఫిర్యాదులు చేసింది.

తాజాగా తెలంగాణా ప్రభుత్వం 24 అక్రమ ప్రాజెక్టులను నిర్మాణానికి పూనుకుందని ఏపి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు కేంద్రానికి ఫిర్యాదుచేశారు. ఈ ఫిర్యాదు ప్రకారం భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు 15 ఉన్నాయట. మిగిలిన తొమ్మిది చిన్నతరహా ప్రాజెక్టులను చెప్పింది. మొత్తం 24 ప్రాజెక్టుల ద్వారా సుమారు 34 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీందించేలా తెలంగాణా ప్రభుత్వం ప్లాన్ చేసిందన్నారు.

తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గవి పాలమూరు-రంగారెడ్డి, దిండి, భక్తరమదాసు, మిషన్ భగీరథ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టుల సామర్ధ్యంపెంపు, బీమా వరదకాలువ, పులిచింతల ప్రాజెక్టులో ఎత్తిపోతల పథకం నిర్మాణం. ఈ ప్రాజెక్టులన్నింటినీ తెలంగాణా ప్రభుత్వం విభజన చట్టాన్ని తుంగలో తొక్కి మరీ నిర్మిస్తోందని ఏపి ఫిర్యాదు చేసింది.

అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇఫ్పటికే ఆరు ప్రాజెక్టులు పూర్తయిపోయి ఆయకట్టుకు నీరందిస్తోందట. అలాగే మరో రెండు ప్రాజెక్టుల పనులు చాలా స్పీడుగా జరుగుతోందట. మరో ఏడు ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వే పనులు జోరుగా జరుగుతున్నాయి. మిగిలిన తొమ్మిది ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వే చేయటానికి ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసిందిని ఇరిగేషన్ ఉన్నతాధికారులు తమ ఫిర్యాదులో స్పష్టంగా చెప్పారు.