కరోనా దెబ్బ.. జట్టు జట్టునే మార్చేశారు


కరోనా కాలంలో క్రీడా రంగంలో ఎన్నెన్నో చిత్రాలు చూశాం. బయో బబుల్ అంటూ కొత్తగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి.. అందులోనే ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, నిర్వాహకులను ఉంచి.. వాళ్లు బయటికి రాకుండా, బయటివాళ్లు లోపలికి పోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసి మ్యాచ్‌లు నిర్వహించడం ఏడాది కిందట్నుంచే చూస్తున్నాం. వివిధ క్రీడల్లో లీగ్స్, టోర్నీలు, సిరీస్‌లు ఇలాగే నిర్వహిస్తూ వస్తున్నారు. ఐతే ఈ బబుల్‌ను పకడ్బందీగా నిర్వహించకుంటే ఏం జరుగుతుందో కూడా చూశాం.

ఐపీఎల్, పీఎస్‌ఎల్ లాంటి టోర్నీలు కరోనా కారణంగా అర్ధంతరంగా ఆగిపోవడం తెలిసిందే. పీఎఎల్‌ను ఇటీవలే పున:ప్రారంభించి పూర్తి చేశారు. ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో నిర్వహించబోతున్నారు. ఐతే ఇప్పుడు ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య రెండు రోజుల్లో వన్డే సిరీస్ మొదలు కావాల్సి ఉండగా.. కరోనా ఊహించని విధంగా దెబ్బ కొట్టింది.

శ్రీలంకతో వన్డే సిరీస్ అయ్యాక నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ముగ్గురు, సహాయ సిబ్బంది నలుగురు పాజిటివ్‌గా తేలారు. కేవలం ఆ ఏడుగురిని పక్కన పెట్టి మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేదు. ఆ ఏడుగురూ మిగతా వాళ్లతోనూ కలిసి ఉన్న వాళ్లే. దీంతో మొత్తం జట్టునంతా క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో సిరీస్‌ను రద్దు చేయడం మినహా మరో మార్గం లేదనే అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ బోర్డు ఆగమేఘాల మీద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. దేశవాళీ ఆటగాళ్లతో ఒక్క రోజు వ్యవధిలో కొత్త జట్టును సిద్ధం చేసింది. ఇందులో బెన్ స్టోక్స్ మినహా అందరూ కొత్త వాళ్లే. కానీ అందరూ కౌంటీల్లో, వివిధ క్రికెట్ లీగ్‌ల్లో రాటుదేలినవాళ్లే.

ఇలా ఒక సిరీస్ ఆరంభం కావడానికి రెండు రోజుల ముందు ఒక జట్టును పక్కన పెట్టి మరో జట్టును పోటీకి సిద్ధం చేయడం ఇంత వరకు జరిగి ఉండదేమో. కరోనా పుణ్యమా అని ఒక భారత జట్టు ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతుంటే.. మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లడం లాంటి అరుదైన దృశ్యాలూ చూడబోతున్నాం. మామూలుగా అయితే జూన్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగించుకుని భారత్ వెనక్కి వచ్చి, శ్రీలంకలో సిరీస్ ముగించుకుని మళ్లీ ఆగస్టులో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కోసం అక్కడికి వెళ్లాల్సింది. కానీ క్వారంటైన్ నిబంధనల కారణంగా కోహ్లీసేన అక్కడే ఉంటోంది. మధ్యలో మరో జట్టును బీసీసీఐ శ్రీలంకకు పంపింది.