‘పుష్ప’ రావాల్సిన తేదీకి ఆ భారీ చిత్రం

ఆగస్టు 13వ తేదీ మీద తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు కొన్ని నెలల ముందు వరకు. ఆ మాటకొస్తే వేరే భాషల వాళ్లను కూడా ఆ తేదీ ఎంతగానో ఆకర్షించింది. అల్లు అర్జున్, సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న బహు భాషా చిత్రం ‘పుష్ప’ ఆ తేదీకే రావాల్సింది. ఈ ఏడాది ఆరంభంలోనే డేట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ గత కొన్ని నెలల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా మళ్లీ దెబ్బ కొట్టింది. షూటింగ్స్ ఆగిపోయాయి. అదే సమయంలో ‘పుష్ప’ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీంతో ప్రణాళికలన్నీ మారిపోయాయి.

ఆగస్టు 13న ఈ చిత్రం విడుదల కాదని ముందుగానే నిర్ణయం అయిపోయింది. ఐతే ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ప్రతి ఏటా భారీ చిత్రాలు విడుదల కావడం ఆనవాయితీ. గత ఏడాది మాదిరే కరోనా కారణంగా ఈసారి కూడా ఏ భాషలోనూ థియేటర్లలో ఆ వీకెండ్లో పెద్ద సినిమాలు రిలీజ్ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది.

ఐతే అప్పటికి థియేటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో కానీ.. ఓ బాలీవుడ్ చిత్రాన్ని ఓటీటీలో ఆగస్టు 13న రిలీజ్ చేయడానికి ముహూర్తం పెట్టేశారు. అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హాల క్రేజీ కాంబినేషన్లో అభిషేక్ దుదైయా రూపొందించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ అగ్ర నిర్మాత భూషణ్ కుమార్ నిర్మించాడు. ఎంతో ఆసక్తికరమైన 1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కడం విశేషం.

స్వాతంత్ర్యానంతరం భారత దేశ చరిత్రలో 1971 ఇండో-పాక్ యుద్ధం అత్యంత ప్రాధాన్యంతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో భారీ తారాగణంతో తెరకెక్కిన సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది. గత ఏడాది హాట్ స్టార్ వాళ్లు ఒకేసారి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ప్రకటించిన అరడజను చిత్రాల్లో ‘భుజ్’ కూడా ఒకటి. ఆ జాబితాలోని మిగతా చిత్రాలన్నీ ఇప్పటికే విడుదలైపోయాయి. అన్నింట్లోకి అత్యధిక అంచనాలున్న ‘భుజ్’ను ఇప్పుడు, ఆగస్టు 13న రిలీజ్ చేయబోతున్నారు. దీనిపై ఉన్న అంచనాల దృష్ట్యా ఫస్ట్ డే ఓటీటీ వ్యూయర్ షిప్ రికార్డులన్నీ బద్దలవుతాయని అంచనా వేస్తున్నారు.