పోలీసు ఇంటికి కన్నం.. సారీ ఫ్రెండ్ అంటూ దొంగ లెటర్..!

తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడటం.. ఆ ఇంట్లో దొరికినదంతా దోచుకెళ్లడం చాలా సహజం. ఓ దొంగ కూడా అలానే దొంగతనం చేశాడు. కానీ.. అలా చేసినందుకు క్షమాపణలు చెప్పాడు. అది కూడా ఓ పోలీసు ఇంట్లో కన్నం వేసి.. దర్జాగా లో లెటర్ పెట్టి వెళ్లిపోయాడు.

ఇంట్లో డబ్బు, నగలను దోచుకెళ్లడమే కాకుండా..వెళ్లే ముందు… ఓ లెటర్ పెట్టి వెళ్లిపోయాడు. అందులో.. తాను కావాలని దొంగతనం చేయలేదని.. పరిస్థితుల కారణంగా చేయాల్సి వచ్చిందని.. క్షమించాలంటూ లో లేఖ కూడా పెట్టడం గమనార్హం. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ లోని బిండ్ నగరానికి చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ కమలేష్ కఠారీ ఇటీవల.. తన కుటుంబంతో కలిసి ఊరు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి.. ఇంటి తలుపులన్నీ తెరచి ఉన్నాయి. ఇంట్లోని వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.

ఆ పక్కనే ఓ లేఖ కూడా ఉంది. అందులో.. ” సారీ ఫ్రెండ్.. నన్ను క్షమించండి. ఇదంతా పరిస్థితుల కారణంగా చేయాల్సి వచ్చింది. నా మిత్రుడి ప్రాణాలు కాపాడుకునేందుకు నేను ఈ దొంగతనం చేశాను. మళ్లీ నాకు డబ్బులు రాగానే మీ దగ్గర దోచుకుంది తిరిగి ఇచ్చేస్తానంటూ” లేఖలో పెట్టడం గమనార్హం.

కాగా… కమలేష్ కి తెలిసిన వారే ఈ దొంగతనం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.