టీవీ5 మూర్తి.. అది నిజం కాదు


తెలుగులో మంచి పేరున్న పాత్రికేయుల్లో మూర్తి పేరు ముందు వరుసలో ఉంటుంది. ప్రతి టీవీ ఛానెల్ కూడా యాజమాన్యం ఉద్దేశాలకు తగ్గట్లే పని చేస్తుంది. అందులో ప్రైమ్ ప్రోగ్రాంలను నిర్వహించే జర్నలిస్టులు కూడా యాజమాన్యం చెప్పినట్లే నడుచుకుంటారు. కాకపోతే మూర్తి మాత్రం మరీ ఏకపక్షంగా చర్చా కార్యక్రమాలను నిర్వహించరని.. సమతూకం పాటిస్తారని.. సమాజంలో జరిగే అన్యాయాలని ప్రశ్నిస్తారని పేరుంది. ఆయన కార్యక్రమాలను పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది.

సొంతంగా తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న మూర్తి దాదాపు దశాబ్దంన్నరగా టీవీ5లో కొనసాగుతున్నారు. ఆయనను అందరూ టీవీ5 మూర్తి అని పిలుస్తారన్న సంగతీ తెలిసిందే. ఐతే ఈ మధ్య యాజమాన్యంతో మూర్తికి గొడవ జరిగిందని.. ఆయనపై రాజకీయ ఒత్తిళ్లు పని చేశాయని.. టీవీ5కు రాజీనామా చేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

పది రోజులకు పైగా టీవీ5లో మూర్తి కనిపించకపోవడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. మూర్తి జర్నలిజం వదిలేశారని.. తన ఊరికి వెళ్లి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారని ఊహాగానాలు జోరందుకున్నాయి. మూర్తి నుంచి స్పందన లేకపోవడంతో ఈ ప్రచారమే నిజమే అనుకున్నారంతా. ఐతే మూర్తి ఇప్పుడు లైన్లోకి వచ్చారు. మళ్లీ టీవీ5లో కనిపించారు. తన గురించి జరిగిన ప్రచారంపై ఆయన టీవీ ద్వారానే స్పందించారు.

తన వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద విషాదం చోటు చేసుకుందని.. ఒక బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత తనపై పడిందని.. అందుకే టీవీ5 ఛైర్మన్ అనుమతితో తాను పది రోజులు సెలవు తీసుకున్నానని.. అంతే తప్ప తాను జర్నలిజం వదిలేసి వ్యవసాయం చేస్తున్నానని ప్రచారం నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయం చేయాలంటే భూమి ఉండాలని.. కానీ తనకు సెంటు భూమి కూడా లేదని.. భూమి కొనుక్కునే ఆర్థిక స్థోమత కూడా లేదని మూర్తి తెలిపారు. ఇక రాజకీయ ఒత్తిళ్ల విషయానికి వస్తే అవి ఎప్పుడూ ఉండేవే అని.. వాటికి తాను ఎప్పుడూ భయపడలేదని తేల్చి చెప్పారు మూర్తి.