టీడీపీ కంచుకోట‌లో ఎవ‌రికి వారే.. య‌మునా తీరే..!

మూలిగే న‌క్క‌మీద తాటికాయ ప‌డిన చందంగా మారింది బెజ‌వాడ టీడీపీ ప‌రిస్థితి. ఇప్ప‌టికే నేత‌లు క‌లిసిరాక‌.. పార్టీ కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌డం లేదు. ప‌ట్టుమ‌ని ప‌దిమంది కూడా కూర్చుని మాట్లాడుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఎవ‌రికి వారే మోనార్క్‌లుగా రాజ‌కీయం వెల‌గ‌బెడుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ఏ ఒక్క‌రూ చ‌లించ‌డంలేదు. ఒక ఎమ్మెల్యే (తూర్పు), ఒక ఎంపీ ఉన్నార‌నే మాటే త‌ప్ప‌.. పార్టీలో జ‌వ‌స‌త్వాలు నింపేందుకు కానీ, కార్య‌క‌ర్త‌ల క‌ష్టాలు తీర్చేందుకు కానీ.. ఏ ఒక్క‌రూ ముందుకు రావ‌డం లేదు. దీనికి రీజ‌నేంటి? అంటే.. ఒక‌రు దూకుడుగా ఉండ‌డం, మ‌రొక‌రు నిదానంగా ఉండ‌డ‌మే కార‌ణంగా తెలుస్తోంది. టీడీపీకి కంచుకోట లాంటి ఇక్క‌డ పార్టీ ప‌రిస్థితి రోజు రోజుకు దిగ‌జారుతూ వ‌స్తోంది.

ముఖ్యంగా ఎపీ కేశినేని నాని దూకుడు ఇప్ప‌టికీ త‌గ్గ‌లేదు. గ‌త కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోరుకు సిద్ధ‌మైన ఆయ‌న పార్టీని గెలిపించి.. త‌న స‌త్తాచాటుతాన‌ని ప్ర‌క‌టించారు అయితే.. ఇది సాధ్యం కాలేదు. పోనీ.. అప్ప‌టి నుంచైనా క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని అవ‌గాహ‌న చేసుకుని ముందుకు న‌డిచి ఉంటే వేరేగా ఉండేది. కానీ, క‌రోనా బూచిని చూపించి.. ఇంటికే ప‌రిమిత‌మయ్యారు. ఇంకా చెప్పాలంటే నానితో మేం ముందుకు క‌లిసి న‌డ‌వ‌లేం అని న‌గర పార్టీ కీల‌క నేత‌లే చెప్పేస్తున్నారు. ఫ‌లితంగా.. కార్య‌క‌ర్త‌లు ముందుకు రాలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అదే స‌మ‌యంలో ఎంపీ నాని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నిస్తుండ‌డం, తూర్పు నియోజ‌క‌వ‌ర్గం త‌న‌దికాదు.. అన్న భావ‌న‌తో వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం మ‌రింత‌గా పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది.

దీంతో ఎంతో సౌమ్యుడ‌నే పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ కూడా ఇప్పుడు ఎంపీపై నిప్పులు చెరుగుతున్నారు. “మాకు ఎంపీ ఉన్నా లేన‌ట్టే” అని ఇటీవ‌ల ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు చంద్ర‌బాబు వ‌ర‌కు వెళ్లినా.. ఆయ‌న కూడా ఏమీ చ‌ర్య‌లు తీసుకోలేదు. ఇక‌, ఎంపీ వైఖ‌రితో విసిగిపోయిన‌.. చాలా మంది నాయ‌కులు.. బ‌య‌ట‌కు రావ‌డం లేదు. మేం వ‌చ్చినా.. ఎంపీ దూకుడు ముందు నిల‌వలేమ‌ని వారు బ‌హిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో విజ‌య‌వాడ టీడీపీ నానాటికీ తీసిక‌ట్టుగా మారిపోయింది.

ఇక‌, ఎప్పుడూ త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు గుప్పిస్తూ.. వార్త‌ల్లో నిలిచే మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. బొండాతో నానికి స‌ఖ్య‌త లేదు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో త‌న‌పైనా కేసులు న‌మోదు చేసే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న బావిస్తున్నార‌ని.. అందుకే బయ‌ట‌కు రావ‌డం లేద‌ని అంటున్నారు. ఇదీ.. ఇప్పుడు విజ‌య‌వాడ టీడీపీ ప‌రిస్థితి.