ఇంతకీ టికెట్ల రేట్ల సంగతేంటి?


కరోనా ప్రభావం బాగా తగ్గడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున:ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణలో రెండు వారాల కిందటే లాక్ డౌన్ ఎత్తేసి థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఇచ్చినప్పటికీ.. ఏపీలో షరతులు కొనసాగుతుండటంతో ఇక్కడ ఒక చోట థియేటర్లు తెరిచి లాభం లేదని ఊరుకున్నారు. ఒక రాష్ట్రంలో థియేటర్లు మూతపడి ఇంకో రాష్ట్రంలో తెరుచుకున్నంత మాత్రాన కొత్త సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు. అందుకే ఏపీలో థియేటర్లు తెరుచుకునే వరకు తెలంగాణలో కూడా ఎదురు చూపులు తప్పలేదు.

ఐతే ఎట్టకేలకు ఏపీలో గోదావరి జిల్లాలు మినహా అన్ని చోట్లా కర్ఫ్యూ ఎత్తేస్తుండటంతో థియేటర్లకు మోక్షం లభిస్తోంది. ఈ నెల 8 నుంచే అక్కడ థియేటర్లు పున:ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో కూడా ఆటోమేటిగ్గా థియేటర్లు తెరుచుకోవడం లాంఛనమే. ఇక కొత్త చిత్రాల విడుదల కోసం నిర్మాతల్లో ఎవరు ముందడుగు వేస్తారన్నది తేలాల్సి ఉంది.

ఐతే ఈ విషయం ఏపీలో టికెట్ల రేట్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపైనే ఆధారపడి ఉంది. లాక్ డౌన్‌కు ముందు చివరగా రిలీజైన ‘వకీల్ సాబ్’ సినిమాకు టికెట్ల రేట్ల విషయంలో ఏపీ సర్కారు కొరడా ఝులింపించిన సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల కిందటి రేట్లను పట్టుబట్టి అమలు చేశారు. 20, 10 రూపాయల టికెట్లను మళ్లీ తీసుకొచ్చారు. ఐతే చిన్న సెంటర్లలో ఈ రేట్లతో టికెట్లు అమ్మి థియేటర్లను నడిపించడం దాదాపు అసాధ్యమన్న అభిప్రాయంతో ఎగ్జిబిటర్లు ఉన్నారు. ఈ రేట్లను కొనసాగించాలంటే థియేటర్లను మూసుకోక తప్పదని తేల్చేశారు.

ఐతే సినీ పరిశ్రమ నుంచి తర్వాత ఏపీ సర్కారుకు విజ్ఞప్తులు వెళ్లాయి. ఎ, బి, సి అని తేడా లేకుండా అన్ని సెంటర్లలో ఒకే రేట్లను అమలు చేసేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. అలాగే కొత్త సినిమా విడుదలైన తొలి వారంలో డిమాండ్‌ను బట్టి రేట్లు పెంచుకునేలా, అదనపు షోలు వేసుకునేలా అనుమతులు ఇవ్వాలని కూడా కోరారు. ఈ విన్నపాలపై ఏదో ఒకటి తేలకుండా నిర్మాతలు కొత్త సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయమై చిరంజీవి బృందం జగన్‌ను కలుస్తారని వార్తలొచ్చాయి. ఆ సంగతేదో తేలాకే థియేటర్లకు మోక్షం లభించే అవకాశముంది.