హుజురాబాద్ ఉప ఎన్నిక తేదీ ఖరారు..?

హుజురాబాద్ ఉప ఎన్నిక త్వరలోనే జరగనుందా..? వచ్చే నెల ఈ ఉప ఎన్నిక నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఈ ఎన్నికకు సంబంధించి కొద్ది రోజుల్లో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయనుందట.

మొన్నటి వరకు టీఆర్ఎస్ లో ఉన్న ఈటల రాజేందర్… ఇటీవల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ హుజురాబాద్ మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా 50 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లేక ఖాళీగా ఉన్నాయట. ఎప్పుడో ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాటిని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి కాస్త కోలుకోవడంతో.. అన్ని నియోజకవర్గాలకు ఉప ఎన్నికకకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా… ఈ హుజురాబాద్ నియోజకవర్గాన్ని దక్కించుకోవడానికి ఇప్పటికే అన్ని పార్టీలు రెడీగా ఉన్నాయి. అభ్యర్థి ఎవరనే దానిపై క్లారిటీకి రాకపోయినా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇక ఈటల రాజేందర్ కూడా దూకుడు మీదున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ కూడా అభ్యర్థి విషయంలో త్వరగా తేల్చేయాలని చూస్తోంది. రేవంత్ టీపీసీసీ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఈనెల 9న ఎన్నికల సంఘం భేటీ కానుంది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించాలనే ప్లాన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. అందులోభాగంగానే ఈ సమావేశం జరుగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇదే అనువైన సమయమని ఈసీ భావిస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈనెల 15 తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

హుజూరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలన్నింటికీ ఉపఎన్నిక నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఉపఎన్నిక జరిపే ఆలోచనలో ఈసీ ఉన్నట్లుటీ చెబుతున్నారు. ఆగస్ట్ చివరినాటికి కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అప్పటిలోగా షెడ్యూల్ ప్రకటించేసి.. ఎన్నిక జరపాలని చూస్తున్నట్లుగా సమాచారం.