పెళ్లైన అమ్మాయిల్ని టార్గెట్ చేస్తాడు..

చూసేందుకు అమాయకంగా కనిపిస్తాడు. మాటలు కూడా ఇంచుమించు అలానే ఉంటాయి. టార్గెట్ పెట్టుకొని మరీ మోసం చేయటంలో దిట్ట. దొంగతనం.. చైన్ స్నాచింగ్.. దొమ్మీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే నేరాలు ఇతగాడి ఖాతాలో కనిపిస్తాయి. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. కానీ.. అతడి బుద్ది మారలేదు. పెళ్లై.. ఒంటరిగా ఉండే డబ్బులున్న అమ్మాయిల్ని వెతికి పట్టుకొని మరీ మోసం చేయటంలో సిద్ధహస్తుడు. అతగాడి నేరాల చిట్టాను చూసి పోలీసులే ఉలిక్కిపడిన వైనం ఇతగాడు సొంతం. మరి.. ఇతడి ఆరాచకాలకు పుల్ స్టాప్ పడలేదా? ఇలాంటోళ్ల ఆట కట్టేసేదెలా? అన్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేశారు హైదరాబాద్ పోలీసులు.

అనంతపురం పట్టణానికి చెందిన 32 ఏళ్ల రంగస్వామి కొంత కాలం క్రితం హైదరాబాద్ వచ్చాడు. లాలాగూడలో సెటిల్ అయ్యాడు. అమాయకంగా నటిస్తూ.. డబ్బులుండి పెళ్లై విడిపోయిన ఆంటీల్ని టార్గెట్ చేసేవాడు. తియ్యటి మాటలు చెప్పేవాడు. మంచిగా నటించి వల్లో వేసుకొని ఎంజాయ్ చేసేవాడు. వారి దగ్గర నుంచి అందినకాడికి దోచేసేవాడు. అనంతరం తన దారిన తాను వెళ్లిపోయేవాడు.

ఒంటరిగా ఉండే పెళ్లైన మహిళలు.. విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేసి.. తేలిగ్గా పని పూర్తి చేసేవాడు. ఇతగాడికి మరో సిత్రమైన అలవాటు ఉంది. అమ్మాయిలా అలంకరించుకొని అమ్మాయిలతో పరిచయం పెంచుకుంటాడు. వారితో స్నేహం నటిస్తూనే.. వారిని దోచేయటం కూడా అతనికున్న దరిద్రపుగొట్టు అలవాట్లలో ఒకటి. అతని పాపం తాజాగా పండింది. లాలాగూడకు చెందిన ఒక మహిళను ఇదే తరహాలో మోసం చేశాడు. ఒళ్లు మండిన ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో.. ఆమె ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేయటం మొదలు పెట్టారు. కేసు ముందుకు వెళుతున్న కొద్దీ రంగస్వామి లీలలన్ని బయటకు వచ్చి పోలీసులు సైతం అవాక్కైన పరిస్థితి.

ఇతగాడి క్రైం రికార్డు కూడా భారీగా ఉందన్న విషయం పోలీసుల విచారణలో బయటకొచ్చింది. మహిళలపై అత్యాచారాలు.. చైన్ స్నాచింగ్.. దొమ్మీలతో సహా మొత్తం పన్నెండు కేసులే కాదు.. ఒక కేసులో రెండేళ్లు జైలు శిక్షను అనుభవించాడు. లాలాగూడ మహిళకు హ్యాండిచ్చి..మరో మహిళతో గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఇతగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. తాజాగా హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఇప్పటికి ఆరుగురు అమ్మాయిల్ని పెళ్లి పేరుతో మోసం చేసి వాడేసుకున్న వైనానికి పోలీసులు సైతం విస్మయానికి గురయ్యే పరిస్థితి.