డిజాస్టర్ తర్వాత ఈ దూకుడేంటి బాబోయ్..


టాలీవుడ్లో సక్సెస్ రేట్ బాగా తక్కువున్న హీరోల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో అతడికి దక్కిన నిఖార్సయిన హిట్లు మూడు మాత్రమే. కెరీర్ ఆరంభంలో చేసిన ‘అతనొక్కడే..’ ఆపై చాలా గ్యాప్‌తో వచ్చిన ‘పటాస్’.. చివరగా ‘118’. ఈ మూడు మాత్రమే బాగా ఆడాయి. మిగతావన్నీ ఫ్లాపులు, డిజాస్టర్లే. చివరగా అతను గత ఏడాది ‘ఎంత మంచివాడవురా’తో పెద్ద డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నాడు.

ఐతే ఈ ప్రభావం కళ్యాణ్ రామ్ కెరీర్ మీద పెద్దగా పడ్డట్లుగా లేదు. తర్వాతి సినిమాలను ప్రకటించడానికి కళ్యాణ్ రామ్ చాలా టైం తీసుకుంటుంటే అవకాశాలు లేవేమో అనుకున్నారు కానీ.. అతను సైలెంటుగా క్రేజీ ప్రాజెక్టులను పట్టాలెక్కించి.. చడీచప్పుడు లేకుండా వాటిని పూర్తి చేసేస్తున్నాడు. కొంచెం లేటుగా ఒక్కో ప్రాజెక్టును అనౌన్స్ చేస్తూ వస్తున్నాడు.

కొన్ని రోజుల కిందటే ‘బింబిసార’ అనే ఫాంటసీ మూవీని కళ్యాణ్ రామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నందమూరి హీరో కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కుతోందని.. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచడానికి చిత్ర బృందం చూస్తోందని అంటున్నారు. ఇక ఈ రోజు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజును పురస్కరించుకుని మరో రెండు కొత్త చిత్రాలను ప్రకటించారు. అందులో ఒకటి అభిషేక్ నామా నిర్మాణంలో ‘బాబు బంగారం’ ఫేమ్ నవీన్ మేడారం రూపొందిస్తున్న పీరియడ్ ఫిలిం ఒకటి. దీని ప్రి లుక్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇది కూడా పెద్ద బడ్జెట్ సినిమానే అంటున్నారు.

మరో వైపు ‘118’ దర్శకుడు కేవీ గుహన్‌తో కళ్యాణ్ రామ్ మళ్లీ జట్టు కట్టబోతున్నాడు. వీరి కలయికలో అగ్ర నిర్మాత దిల్ రాజు ఓ సినిమా నిర్మించబోతుండటం విశేషం. ‘118’ తరహాలోనే ఇది కూడా క్రైమ్ థ్రిల్లరే. ఇవిలా ఉండగా.. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌లోనూ కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజేంద్ర అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది.