ప్ర‌భుత్వ‌మే ఓటీటీ పెడుతోంద‌ట‌

ఇప్పుడు సినీ రంగానికి సంబంధించి బాగా న‌డుస్తున్న బిజినెస్ అంటే ఓటీటీలే. క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ ఇండ‌స్ట్రీ దారుణంగా దెబ్బ తిన‌గా.. అదే స‌మ‌యంలో ఓటీటీ బిజినెస్ లాభ‌సాటిగా మారింది. లాక్ డౌన్ కార‌ణంగా బ‌య‌టికి వెళ్ల‌లేక ఇళ్ల‌లోనే ఉంటూ ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడ‌టానికి అల‌వాటు ప‌డ్డారు జ‌నం. ఇటు ప్రేక్ష‌కుల‌కు, అటు నిర్మాత‌ల‌కు లాక్ డౌన్ టైంలో ఓటీటీలే దిక్క‌య్యాయి.

గ‌త ఏడాది వ్య‌వ‌ధిలో అప్ప‌టికే ఉన్న ఓటీటీల‌కు స‌బ్‌స్క్రైబ‌ర్లు అమాంతం పెర‌గ్గా.. కొత్త‌గా వ‌చ్చి ఓటీటీల‌కు మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. మ‌రింద‌రు ప్రైవేట్ ప్లేయ‌ర్లు ఓటీటీ బిజినెస్ మీద దృష్టిపెడుతుండ‌టంతో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త సంస్థ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఐతే ఆశ్చ‌ర్య‌క‌రంగా ఇప్పుడు ఒక రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే ఓటీటీ మొద‌లుపెట్టే ఆలోచ‌న చేస్తుండ‌టం విశేషం.

కేర‌ళలోని విజ‌య‌న్ స‌ర్కారు మ‌ల‌యాళ ప‌రిశ్ర‌మ‌ను ఆదుకోవ‌డానికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఒక ఓటీటీ పెట్టాల‌ని చూస్తోంది. ఈ విష‌యాన్ని కేర‌ళ సాంస్కృతిక శాఖా మంత్రి సాజి చెరియ‌న్ ఓ ప్రెస్ మీట్లో వెల్ల‌డించ‌డం విశేషం. కొవిడ్ నేప‌థ్యంలో చిన్న సినిమాలు లెక్క‌లేన‌న్ని విడుద‌ల‌కు నోచుకోకుండా ఆగిపోయాయ‌ని.. థియేట‌ర్లు మ‌ళ్లీ మొద‌లైనా వాటికి మోక్షం ల‌భించ‌డం క‌ష్ట‌మే అని.. ఇప్పుడున్న ఓటీటీలు కూడా అన్ని సినిమాల‌కూ ఆఫ‌ర్లు ఇవ్వ‌డం లేద‌ని భావించి.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఓటీటీ మొద‌లుపెట్టి ఈ చిన్న సినిమాల‌కు వీలున్నంత‌లో మంచి ధ‌ర ఇచ్చి కొని ఆ ఓటీటీలో స్ట్రీమ్ చేయాల‌ని కేర‌ళ ప్ర‌భుత్వం భావిస్తోంది.

లాభాపేక్ష లేకుండా ఓటీటీని న‌డప‌డం ద్వారా చిన్న సినిమాల‌కు న్యాయం చేయ‌డంతో పాటు ప్రేక్ష‌కుల‌కు త‌క్కువ ధ‌ర‌కు సినీ వినోదాన్ని అందించాల‌న్నది కేర‌ళ ప్ర‌భుత్వం ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. ఇది కార్య‌రూపం దాల్చితే మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ‌కు గొప్ప మేలు జ‌రుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. బ‌హుశా ప్ర‌పంచంలో ఎక్క‌డా ఇలాంటి ప్ర‌య‌త్నం జ‌రిగి ఉండ‌క‌పోవ‌చ్చు.