శంక‌ర్‌తో క‌లిసి తేల్చేయ‌బోతున్న చ‌ర‌ణ్‌

Charan Shankar


ఈ ఏడాది సౌత్ ఇండియాలో కొత్త‌గా ప్ర‌క‌టించిన హీరో-డైరెక్ట‌ర్ కాంబినేష‌న్ల‌లో అంద‌రినీ ఎంతో ఎగ్జైట్ చేసింది టాలీవుడ్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, త‌మిళ ఏస్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ల‌దే. త‌మిళ అనువాద చిత్రాల‌తో తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న శంక‌ర్.. తొలిసారి ఓ తెలుగు హీరోతో సినిమా చేయ‌బోతుండ‌టం.. చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ త‌ర్వాత చేయ‌బోయే చిత్ర‌మిదే కావ‌డంతో దీనిపై ప్రేక్ష‌కుల్లో అమితాస‌క్తి నెల‌కొంది.

దిల్ రాజు నిర్మాణంలో తెర‌కెక్క‌నున్న ఈ పాన్ ఇండియా మూవీ గురించి ప్ర‌క‌ట‌న వ‌చ్చి చాలా రోజులైంది. కానీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందో మాత్రం స్పష్ట‌త లేదు. క‌రోనా సెకండ్ వేవ్ వ‌ల్ల క‌లిగిన ఆల‌స్యానికి తోడు.. శంక‌ర్‌కు ఇండియ‌న్-2 నిర్మాత‌ల‌తో ఉన్న లీగ‌ల్ ఇష్యూస్ ఈ సినిమాపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టుపై సందిగ్ధ‌త నెల‌కొంది.

ఐతే రామ్ చ‌ర‌ణ్ అతి త్వ‌ర‌లోనే శంక‌ర్‌ను క‌లిసి ఈ ప్రాజెక్టుపై నేరుగా చ‌ర్చించ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టిదాకా ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకోవ‌డ‌మే త‌ప్ప నేరుగా చ‌రణ్‌, శంక‌ర్ మాట్లాడుకున్న‌ది లేదు. చ‌ర‌ణ్ తీరిక లేకుండా ఉండ‌టంతో పాటు క‌రోనా కూడా అందుకు కార‌ణ‌మే. ఐతే మ‌రి కొన్ని రోజుల్లో చ‌ర‌ణ్‌.. చెన్నైకి వెళ్లి శంక‌ర్‌తో స‌మావేశం కానున్నాడ‌ట‌. దిల్ రాజు కూడా చ‌ర‌ణ్ వెంట వెళ్ల‌నున్నాడ‌ట‌.

ఆ సంద‌ర్భంగా స్క్రిప్ట్ ఫైన‌లైజ్ చేయ‌డంతో పాటు కాస్టింగ్ గురించి కూడా చ‌ర్చించ‌నున్నార‌ని.. అలాగే శంక‌ర్‌కు ఇండియ‌న్-2 నిర్మాత‌ల‌తో ఉన్న స‌మ‌స్య‌ల గురించి కూడా మాట్లాడి.. ఓ స్ప‌ష్ట‌త తెచ్చుకోవాల‌ని.. దాన్ని బ‌ట్టి ఈ చిత్రాన్ని ఎప్పుడు సెట్స్ మీదికి తీసుకెళ్లాల‌న్న‌ది కూడా నిర్ణ‌యించనున్నార‌ని స‌మాచారం. ఆ మీటింగ్ తర్వాత షూటింగ్ గురించి, కాస్ట్ అండ్ క్రూ గురించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.