డాక్టరు దంపతులు ఎంత పని చేశారంటే…

చూడ చక్కని ఈ జంట చేసిన పని తెలిస్తే జీర్ణించుకోవటం కష్టం. వైవాహిక జీవితంలో ఆటుపోట్లు సహజం. అంతమాత్రానికే ప్రాణాలు తీసుకోవాటానికి మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు. అందులోనూ ఈ భార్యభర్తలు ఇద్దరు డాక్టర్లు. ప్రాణం విలువ వారికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. అలాంటిది.. కోపతాపాలు.. గొడవలతో విలువైన ప్రాణాల్ని తీసుకున్న ఈ యువ డాక్టర్ల జంట తీరు షాకింగ్ గా మారింది. మహారాష్ట్రలోని ఫూణెకు చెందిన వైద్యుల జంట సూసైడ్ చేసుకున్న వైనం సంచలనంగా మారింది.

నిఖిల్.. అకింతలు ఇద్దరు వైద్యులే. పెళ్లైన కొన్నాళ్ల నుంచి వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి కాస్తా పెరిగి పెద్దవి అయ్యాయి. గురువారం భర్త ఆసుపత్రిలో ఉన్న వేళలో అంకిత ఫోన్ చేసింది. ఇద్దరి మధ్య వాదులాట సాగింది. కోపంతో నిఖిల్ ఫోన్ పెట్టేశాడు. పనిలో మునిగిపోయాడు. తీరా ఇంటికి వచ్చి చూస్తే.. ఫ్యాన్ కు వేలాడుతూ భార్య దేహం కనిపించటంతో తట్టుకోలేకపోయాడు.

వెంటనే పక్క గదిలోకి వెళ్లి తాను కూడా ఊరిపోసుకొని మరణించాడు. వారిద్దరి మధ్య అంతకు ముందు రోజు రాత్రి కూడా గొడవలు జరిగినట్లుగా వారి ఫోన్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఉదయాన్నే ఇంట్లో పని చేసేందుకు వచ్చిన పనిమనిషి.. తలుపు తెరవకపోవటంతో ఇరుగుపొరుగు వారి సాయాన్ని కోరింది.తలుపులు బద్ధలు కొడితే.. ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని గుర్తించారు. విచారణలో వీరి ఆత్మహత్యల వైనం తెలిసిందే. భార్యభర్తల మధ్య గొడవలు ఎన్నైనా ఉండొచ్చు. సామరస్యంగా సర్దుబాటు చేసుకోవాలి. అప్పటికి కుదరకపోతే..ఎవరిజీవితం వారు జీవించాలి. అంతమాత్రానికే మరణం పరిష్కారం ఏ మాత్రం కాదన్నది మర్చిపోకూడదు.