మోడి అడ్వాంటేజ్ తీసుకుంటారా ?

ఇపుడిదే అంశంపై బీజేపీలోను నాన్ ఎన్డీయే పార్టీలో చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మళ్ళీ గెలవటానికి బీజేపీకి ఓ అవకాశం వచ్చిందనే అనుకుంటున్నారు. అదేమిటంటే బీజేపీకి బలమైన పోటీదారులైన ఎస్పీ, బీస్పీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి కాబట్టే. నరేంద్రమోడి పాలనపై యావత్ దేశంలోను తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోతున్న విషయం అందరు చూస్తున్నదే.

ఇందులో భాగంగానే యూపిలో కూడా వ్యతిరేకత పెరిగిపోయింది. ఈమధ్యనే జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. చివరకు మోడి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి లోక్ సభ పరిధిలోని స్ధానికసంస్ధల్లో కూడా కమలం చిత్తుగా ఓడిపోవటం పార్టీ నేతలకు పెద్ద షాకనేచెప్పాలి. ఇలాంటి నేపధ్యంలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

అయితే క్షేత్రస్ధాయిలో మోడిపై ఉన్న వ్యతిరేకతను అడ్వాంటేజ్ తీసుకోవటానికి బలమైన ప్రతిపక్షాలు పెద్దగా ప్రయత్నిస్తున్నట్లు లేదు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షాలంటే ఎస్పీ, బీఎస్పీ మాత్రమే. ఇవిరెండు కూడా దేనికదే వేర్వేరుగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. యూపీలో ఇంకా చాలా పార్టీలున్నప్పటికీ అంతగా ప్రభావం చూపగలిగే స్ధాయిలో మాత్రం లేవనే చెప్పాలి. అదే గనుక ఎస్పీ+బీఎస్పీ కలిసి పోటీచేస్తే బీజేపీ పని గోవిందానే.

రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు వేటికవే పోటిచేస్తే ఓట్ల చీలిక రావటం ఖాయం. ఎన్ని పార్టీల మధ్య ఓట్లు చీలిపోతే అధికారపార్టీకి అంత అడ్వాంటేజ్ అన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. కాబట్టి ఒకవైపు ఎస్పీ, మరోవైపు బీఎస్పీ, ఇంకోవైపు కాంగ్రెస్ తో పాటు మిగిలిన చిన్నా చితకా పార్టీలు. ఇన్ని పార్టీల మధ్య ఓట్లు చీలిపోయినా బీజేపీకి పడే కొన్ని ఓట్లు సాలిడ్ గా పడితే చాలు గెలిచిపోతుంది. మరిపుడు మోడి ప్రతిపక్షాల్లోని అనైక్యతను అడ్వాంటేజ్ తీసుకుంటారా ? చూద్దాం ఏమి చేస్తారో.