కొరటాల శివ.. ఇప్పుడు ప్రశాంతం

Koratala Siva

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో సోషల్ మీడియాలో ఉన్న వాళ్లు, అందులోనూ యాక్టివ్‌గా ఉండేవాళ్లు చాలా తక్కువమంది. ఒక్క రాజమౌళి మాత్రమే సుదీర్ఘ కాలం నుంచి సోషల్ మీడియాలో ఉంటున్నాడు. ఆయన చాలామందితో పోలిస్తే యాక్టివ్ అనే చెప్పాలి. మిగతా వాళ్లు చాలా వరకు సామాజిక మాధ్యమాలకు దూరమే. ఐతే కొన్నేళ్ల కిందట కొరటాల శివ ట్విట్టర్లోకి అడుగు పెట్టాడు.
ఐతే మరీ యాక్టివ్‌గా ఉన్నదేమీ లేదు కానీ.. అప్పుడప్పుడూ కొన్ని సామాజిక అంశాల మీద తనదైన శైలిలో స్పందించడం ద్వారా ప్రత్యేకతను చాటుకున్నారు. ఐతే ఇటీవల ఆయన ఉన్నట్లుండి ట్విట్టర్‌కు దూరం అయిపోయారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. సామాజిక మాధ్యమంలో తాను చెప్పాలనుకున్నది చెప్పేశానని.. ఇక దీనికి దూరంగా ఉండాలనుకుంటున్నానని కొరటాల నోట్ రిలీజ్ చేయడం చర్చనీయాంశం అయింది.

ట్విట్టర్లో కొరటాల శివ ఏ వివాదంలోనూ జోక్యం చేసుకోలేదు. అయినా సరే.. ఏదో హర్టయినట్లుగా ఇలా ప్రకటన చేసి నిష్క్రమించడంపై రకరకాల సందేహాలు రేకెత్తాయి. ఐతే ట్విట్టర్లో ఉండటం వల్ల కొంత ప్రశాంతత కోల్పోవడంతో పాటు టైం వేస్ట్ అవుతోందనే కొరటాల ఇక్కడి నుంచి నిష్క్రమించినట్లు సమాచారం. ట్విట్టర్లో సెలబ్రెటీలను నెటిజన్లు ఎలా టార్గెట్ చేస్తారో తెలిసిందే. వివాదాలకు దూరంగా, హుందాగా వ్యవహరించే వాళ్లను కూడా వదిలిపెట్టరు. ట్రోల్ చేయడం తమ జన్మ హక్కు లాగా ఫీలవుతుంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా విమర్శించేస్తుంటారు.

ముందు అల్లు అర్జున్‌తో సినిమా కమిటై, తర్వాత దాన్ని పక్కన పెట్టి ఎన్టీఆర్ సినిమాను ముందుకు తీసుకు రావడం, ‘ఆచార్య’ సినిమాను ఆలస్యం చేస్తుండటం, ఈ సినిమా కథ విషయంలో ఇంతకుముందు నెలకొన్న వివాదం.. తరహా విషయాల్లో తనను నెటిజన్లు తరచుగా టార్గెట్ చేస్తుండటం.. తనను కోట్ చేసి మెసేజ్‌లు పెడుతుండటం పట్ల కొరటాల అసహనానికి గురయ్యారని.. ఎంత లైట్ తీసుకున్నప్పటికీ.. ఇలాంటి కామెంట్లు చదువుతున్నడపు కొంచెం డిస్టర్బ్ అవుతుండటం, ట్విట్టర్లో ఉండటం వల్ల కొంచెం టైం వేస్ట్ కూడా అవుతుండటంతో ఆయన ఇక చాలనిపించేశారని సమాచారం. ట్విట్టర్ నుంచి బయటికి వచ్చేసినప్పటి నుంచి చాలా ప్రశాంతంగా ఉందంటూ సన్నిహితుల దగ్గర ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది.