మోడీజీ.. మన చేతికి అధికారం వచ్చి ఏడేళ్లైంది

భారత్ కు తిరుగులేని అధినేతగా.. సమీప భవిష్యత్తులో మోడీ తప్పించి మరో అధినేత పేరును ప్రస్తావించే పరిస్థితి లేదన్న వేళ.. వచ్చిన కరోనా మహమ్మారి మొదట్లో ఆయన ఇమేజ్ ను మరింత పెరిగేలా చేసింది. ఇదే.. ఆయన దీపాలు పెట్టమని అడిగితే యావత్ దేశం దీపాలు పెట్టింది. గంట కొట్టమంటే గంట కొట్టింది. పూలు జల్లమని చెబితే పూలు చల్లింది. ఇలా ఆయన నోటి నుంచి టాస్కు రావటం ఆలస్యం.. దాన్ని పూర్తి చేయటం తప్పించి మరే ఆలోచన లేదన్నట్లుగా స్పందించిన పరిస్థితి.

అలాంటి మోడీ సర్కారు సెకండ్ వేవ్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు ఆయన ఇమేజ్ తో పాటు.. కేంద్ర ప్రభుత్వ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీశాయి. దీనికి తోడు పెట్రోల్.. డీజిల్ ధరల పెరగటం అగ్నికి ఆజ్యంపోసేలా చేశాయి. గడిచిన ఆరేళ్లలో మోడీని పల్లెత్తు మాట అనని వారు సైతం.. ఇప్పుడు ఆయన్ను విమర్శించటానికి.. విరుచుకుపడటానికి అస్సలు వెనుకాడటం లేదు. మోడీని విమర్శిస్తే ఏమవుతుందో? అన్న సందేహం నుంచి ఏమైతే అది కానీ.. ఆయన తప్పుల్ని ఎండగట్టాల్సిందేనన్న పట్టుదల ఈ మధ్యన పెరుగుతోంది.

ఇదిలా ఉంటే..తాజాగా ఆయన డాక్టర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వేళ వైద్యులు ప్రజలకు అపారమైన సేవలు అందించిన విషయాన్ని గుర్తు చేయటమేకాదు.. దేశంలోని వైద్యులందరికి ఆయన ధన్యవాదాలు ప్రకటించారు.మహమ్మారి వేళ.. దేవుళ్ల మాదిరి పని చేశారని.. వారి పని చేసిన కారణంగా ప్రజల ప్రాణాల్ని నిలబెట్టినట్లుగా చెప్పారు. కోవిడ్ కారణంగా చాలామంది వైద్యులు తమ ప్రాణాల్ని కోల్పోయారని.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసినట్లు ప్రకటించారు.

ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడే ఆయనలోని ప్రధానమంత్రి పాత్రను తగ్గించేలా రాజకీయ నాయకుడు నిద్ర లేచారు. కరోనా వేళ.. వైద్య సదుపాయాలు.. మౌలికవసతుల విషయంలో గత ప్రభుత్వాల తీరును తప్పు పడుతూ విమర్శించారు. 2014 వరకు దేశంలో ఆరు ఎయిమ్స్ సంస్థలు మాత్రమే ఉంటే.. ఏడేళ్లలో 15 కొత్త ఎయిమ్స్ ను అందుబాటులోకి తెచ్చినట్లుగా పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల్ని పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.

మహా మేధావిగా ముద్ర ఉన్న మోడీ.. ఇలా సాదాసీదా రాజకీయ నేత మాదిరి వ్యాఖ్యలు చేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇన్ని ఆసుపత్రులు ఏర్పాటు చేసిన తర్వాత కూడా.. దేశంలో ఇన్ని భారీ మరణాలు ఎందుకు చోటు చేసుకున్నాయి? సెకండ్ వేవ్ వేళ.. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆక్సిజన్ కొరత.. ఆసుపత్రుల ఎదుట బారులు తీరిన వైనం దేశ ప్రజలంతా చూశారు. ఇలాంటివేళ.. అలాంటి రద్దీని ఊహించి అందుకు తగ్గట్లుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో విఫలమైన మోడీ.. గత ప్రభుత్వాల్ని విమర్శించటం ఎంతవరకు సబబు?

నిజానికి ఏడేళ్ల క్రితం ఆయనకు అధికారం అప్పజెప్పింది.. గత ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని.. దేశాన్ని మొత్తంగా మార్చేస్తారన్న నమ్మకంతోనే కదా? ఒక టర్మ్ ను విజయవంతంగా పూర్తి చేసి.. రెండో టర్మ్ లో సగ భాగం పూర్తి అవుతున్న వేళలోనూ.. సగటు రాజకీయ నాయకుడి మాదిరి గత ప్రభుత్వాల పని తీరును వేలెత్తి చూపటం మోడీ లాంటి వ్యక్తిత్వ వికాస నిపుణుడు చేయాల్సిన పని కాదు. అయినా.. మోడీకి ఈ లైన్ లో మాట్లాడాలని సలహాలు ఇస్తున్న థింక్ ట్యాంక్ ను తప్పు పట్టాలి. గతంలో మాదిరి మోడీకి అమితమైన ఇమేజ్ ఉందన్న భ్రమలోని బయటకు రావాల్సిన అవసరం ఉండదు. లేనిపక్షంలో ఆయన పేరు ప్రఖ్యాతులు మరింత తగ్గటం మినహా మరేమీ ఉండదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.