చేతగానితనం అనుకోవద్దు.. టీ మంత్రులకు షాకిచ్చిన ఏపీ మంత్రి

జల జగడం పై రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య కొత్త పంచాయితీని తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో అవసరం లేని ఆవేశాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రదర్శించినప్పటికీ.. ఏపీ అధికారపక్షం మాత్రం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించిందే తప్పించి.. అధికారపక్షానికి చెందిన ఏ నాయకుడు కూడా నోరు పారేసుకున్నది లేదు.

తమ ఆరాధ్య దైవమైన దివంగత మహానేత వైఎస్ ను ఉద్దేశించి తెలంగాణ మంత్రులు పలువురు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాంటి మాటలతో సెంటిమెంట్ ను రాజేయాలన్న వ్యూహాన్ని అమలు చేసే ప్రయత్నాన్ని ఏపీ నేతలు సంయమనంతో చెక్ చెప్పారు. అయినప్పటికీ అదే పనిగా టీఆర్ఎస్ నతల్లో కొందరు నోరు పారేసుకుంటున్నారు. ఇలాంటి వారికి తనదైన శైలిలో చెక్ పెట్టే ప్రయత్నం చేశారు మంత్రి అనిల్ కుమార్.

తమ సంయమనాన్ని చేతగానితనంగా భావించొద్దని స్పష్టం చేశారు మంత్రి అనిల్. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరికాదని.. దీనికి బదులు తీర్చుకుంటామని స్పష్టం చేయటం సంచలనంగా మారింది. శ్రీశైలం డెడ్ స్టోరేజీ నిల్వను విద్యుదుత్పత్తి కోసం వాడేయటం దుర్మార్గమన్న ఆయన.. పొరుగు రాష్ట్రం తీరును మంత్రి మండలి తీవ్రంగా పరిగణించినట్లుగా మంత్రి అనిల్ స్పష్టం చేశారు.

తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే భాష వాడుతున్నారని.. పదేళ్ల క్రితం మరణించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు. తాజాగా వ్యాఖ్యలతో.. నోటికి వచ్చినట్లు ఇష్టారాజ్యంగా మాట్లాడితే సరిగా ఉండదన్న విషయాన్ని అర్థమయ్యేలా మంత్రి అనిల్ చెప్పారని చెప్పాలి. మరి.. వారి రియాక్షన్ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇష్యూ ఏదైనా.. నోరు పారేసుకోవటం మంచిది కాదన్న అభిప్రాయాన్ని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.