సీనియర్లు ఏకమవుతున్నారా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు సీనియర్లు కూడా పీసీసీ పగ్గాల కోసం బాగా ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే సీనియర్లందరినీ కాదని అధిష్టానం రేవంత్ వైపు మొగ్గుచూపింది. ఇక్కడే సమస్య మొదలైంది. పార్టీలో ఇంతమంది సీనియర్లను కాదని టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ కు అధ్యక్ష పదవిని కట్టబెట్టడంపై సీనియర్లలో చాలా మందే అధిష్ఠానంపై మండిపోతున్నారు.

ఈ కారణంతోనే చాలామంది సీనియర్లు రేవంత్ కు వ్యతిరేకంగా జట్టు కడుతున్నారట. నిజానికి పేరుకు సీనియర్లే కానీ పట్టుమని తమ జిల్లాల్లో తిరిగి మద్దతు కూడగట్టేంత సీన్ కూడా చాలామందికి లేదన్నది వాస్తవం. తమకు మద్దతుగా పదిమందిని కూడా కూడగట్టుకోలేకపోవటం మరో మైనస్. అయినా రాజకీయాల్లో ఇవన్నీ కామనే కాబట్టి చాలామంది తమకే పీసీసీ కావాలని ప్రయత్నాలు చేసుకున్నారు.

రేవంత్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపోయారు. జీవితంలో తాను ఇక పీసీసీ భవన్ మెట్లెక్కేది లేదని శపథం చేశారు. మరో సీనియర్ నేత, ఎన్నికల కమిటి ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఏఐసీసీ సభ్యుడు, సీనియర్ నేత లక్ష్మారెడ్డి ఏకంగా పార్టీకే రాజీనామా చేసేశారు. మరి మిగిలిన నేతల్లో చాలామంది ఏమి చేస్తారనే విషయాన్ని వెయిట్ చేసి చూడాలి.

రేవంత్ తో పాటు కొందరు సీనియర్లను ఉపాధ్యక్షులుగా, వర్కింగ్ ప్రెసిడెంట్లు తదితర పోస్టుల్లో ఏఐసీసేనే నియమించింది. మరి ఆ పోస్టుల్లో వాళ్ళంతా హ్యాపీయేనా లేక అసంతృప్తితో ఉన్నారా అనేది జూలై 7వ తేదీకి తేలిపోతుంది. ఎందుకంటే ఈ రోజున అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు తీసుకోబోతున్నారు కాబట్టి.