ఇంటర్వెల్‌ వచ్చేసింది.. సినిమా ఎలా ఉంది?

చూస్తుండగానే ఏడాదిలో సగం గడిచిపోయింది. సరిగ్గా ఏడాది మధ్యలో ఉన్నాం. మామూలుగా అయితే ఏడాది సగం పూర్తి కాగానే అప్పటిదాకా రిలీజైన సినిమాల సమీక్ష జరుపుకోవాలి. కానీ గత ఏడాది లాగే ఈసారి కూడా సినిమాలకు కరోనా దెబ్బ తప్పలేదు. తొలి క్వార్టర్ వరకు మాత్రమే సినిమా బండి సజావుగా నడిచింది. రెండో క్వార్టర్ ఆరంభంలో కరోనా సెకండ్ వేవ్ మొదలై సినీ కార్యకలాపాలన్నింటినీ ఆపేసింది. అయినప్పటికీ ఇంత వరకు తెలుగు సినిమా ప్రోగ్రెస్ ఏంటో ఒకసారి చూడాల్సిన సమయమిది.

వేరే సినీ ఇండస్ట్రీలతో పోలిస్తే ఈ ఏడాది ఉన్న కొద్ది సమయంలోనే టాలీవుడ్ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ సూపర్ అనే చెప్పాలి. థియేటర్లు మూతపడ్డానికి ముందు చివరగా థియేటర్లలో నడిచిన ‘వకీల్ సాబ్’ అంచనాలకు తగ్గట్లే మంచి విజయం సాధించింది. ఏడాదికి పైగా విరామం తర్వాత తెలుగులో రిలీజైన భారీ చిత్రం ఇదే. తొలి ఆరు నెలల్లో ఇదే హైయెస్ట్ గ్రాసర్. ఏపీలో టికెట్ల రేట్లలో నియంత్రణ, అదనపు షోలు లేకపోవడం వల్ల దీని వసూళ్లపై ప్రభావం పడింది. అయినప్పటికీ ఈ చిత్రం రూ.100 కోట్ల షేర్ మార్కుకు చేరువగా వచ్చింది. ఇక ఈ ఏడాది పెట్టుబడి-రాబడి పరంగా బిగ్గెస్ట్ హిట్ అంటే ‘జాతిరత్నాలు’నే. ఈ చిత్రం రూ.35 కోట్ల దాకా షేర్ రాబట్టి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీని కంటే ముందు వచ్చిన ప్రేమకథా చిత్రం ‘ఉప్పెన’ కూడా అసాధారణ విజయం అందుకుంది. కొత్త హీరో హీరోయిన్లతో నూతన దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. డెబ్యూ హీరో సినిమాల్లో కొత్త రికార్డులను నెలకొల్పింది ‘ఉప్పెన’.

ఇక సంక్రాంతికి వచ్చిన రవితేజ చిత్రం ‘క్రాక్’ కూడా పెద్ద బ్లాక్‌బస్టర్ అయింది. 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్న సమయంలోనే ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. సంక్రాంతికే వచ్చిన ‘రెడ్’ కూడా హిట్ స్టేటస్ అందుకోగా.. చిన్న సినిమాలు నాంది, జాంబి రెడ్డి, 30 రోజుల్లో ప్రేమించడం కూడా నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలు అందించాయి. వైల్డ్ డాగ్, రంగ్ దె, శ్రీకారం చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ఫలితం లేకపోయింది. అరణ్య, అల్లుడు అదుర్స్, మోసగాళ్లు, చెక్, చావు కబురు చల్లగా, కపటధారి లాంటి చిత్రాలు పూర్తిగా నిరాశ పరిచాయి.