రెంటికీ చెడ్డ తెలుగు ప్రేక్షకుడు

దేశంలో సినిమాల‌పై తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఉన్నంత ప్రేమ ఇంకెవ‌రికీ లేద‌న్న‌ది స్ప‌ష్టం. ఈ విష‌యం ఎన్నోసార్లు రుజువైంది. ఒక రీజ‌నల్ ఇండ‌స్ట్రీ అయిన టాలీవుడ్లో దేశంలోనే అత్య‌ధిక సినిమాలు తెర‌కెక్కుతున్నాయంటే.. బాలీవుడ్ సినిమాల‌కు దీటుగా వ‌సూళ్లు రాబ‌డుతున్నాయంటే అది మ‌న వాళ్ల సినిమా అభిమానం వ‌ల్లే. గ‌త ఏడాది క‌రోనా దెబ్బ నుంచి కోలుకోలేక మిగ‌తా సినీ ప‌రిశ్ర‌మ‌ల‌న్నీఅల్లాడిపోతుంటే.. టాలీవుడ్ మాత్రం చాలా త‌క్కువ స‌మ‌యంలోనే పుంజుకుని సాధార‌ణ స్థితికి చేరుకుంది.

ఐతే క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు మ‌ళ్లీ థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. సినీ వినోదానికి తెర‌ప‌డింది. ఐతే గ‌త ఏడాది లాక్ డౌన్ ప‌డ్డ కొంత కాలానికి ఓటీటీల ద్వారా కొత్త సినిమాలు వ‌రుస‌గా రిలీజ‌వుతూ వ‌చ్చాయి. వాటితో కొంత‌మేర లోటు భ‌ర్తీ అయింది. కానీ సెకండ్ వేవ్ దెబ్బ‌కు మ‌ళ్లీ థియేట‌ర్లు మూత‌ప‌డ్డాక మాత్రం ఓటీటీల్లో కొత్త సినిమాలు క‌ర‌వైపోయాయి.

ఈసారి లాక్ డౌన్ త‌క్కువ రోజులే ఉంటుంద‌ని.. మ‌ళ్లీ త్వ‌ర‌గానే థియేట‌ర్లు పునఃప్రారంభం అవుతాయ‌ని భావించి కొత్త సినిమాల‌ను ఓటీటీల‌కు ఇవ్వ‌డానికి నిర్మాత‌లు వెనుకంజ వేశారు. పైగా గ‌త ఏడాది లాక్ డౌన్ బ్రేక్ త‌ర్వాత సినిమాల‌ను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తే కొన్నింటికి భారీ వ‌సూళ్లు వ‌చ్చాయి. క్రాక్, ఉప్పెన‌, జాతిర‌త్నాలు లాంటి సినిమాల‌కు వ‌చ్చిన వ‌సూళ్లు చూశాక థియేట్రిక‌ల్ రిలీజ్ మీదే ఆశ‌తో ఉన్నారు నిర్మాత‌లు. ఈ నేప‌థ్యంలోనే ఓటీటీల‌కు సినిమాలు ఇవ్వ‌ట్లేదు. ఐతే థియేట‌ర్లలో ఒక‌ప్ప‌ట్లా ఎప్పుడు కాంతులు చూస్తామో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది.

తెలంగాణ‌లో థియేట‌ర్లకు అనుమ‌తులు వ‌చ్చినా.. ఏపీలో ఆంక్ష‌లు కొన‌సాగుతుండ‌టంతో కొత్త సినిమాల‌ను రిలీజ్ చేసే ప‌రిస్థితి లేదు. పైగా ఆక్యుపెన్సీ విష‌యంలో సందిగ్ధ‌త నెల‌కొంది. ఏపీలో టికెట్ల రేట్ల గొడ‌వా ఉంది. అందుకే థియేట‌ర్ల పునఃప్రారంభం ఆల‌స్య‌మ‌య్యేలా ఉంది. ఈలోపు ఓటీటీల్లోనూ కొత్త సినిమాలు లేక రెండు నెల‌ల‌కు పైగా తెలుగు ప్రేక్ష‌కులు నిరాశ‌లో ఉన్నారు. మాస్ట్రో, నార‌ప్ప‌, దృశ్యం-2, విరాట‌ప‌ర్వం లాంటి సినిమాల‌ను ఓటీటీల‌కు ఇచ్చేశారంటున్నారు కానీ.. అవి ఇప్పుడిప్పుడే రిలీజ‌య్యే సంకేతాలేమీ క‌నిపించ‌డం లేదు. దీంతో ఇటు థియేట‌ర్ల‌లో సినిమాలు లేక‌.. అటు ఓటీటీల్లోనూ కొత్త వినోదం లేక తెలుగు ప్రేక్ష‌కులు నైరాశ్యంలో మునిగిపోయి ఉన్నారు.