జగన్ మాట: ఏపీ ముఖ్యమంత్రి ఒక మహిళ

తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ ప్రసంగాలప్పుడు.. ప్రెస్ మీట్లలో మాటలు తడబడితే వైకాపా వాళ్లు ఎంతగా ట్రోల్ చేసేవాళ్లో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ కారణంతోనే లోకేష్‌కు ‘పప్పు’ అనే నామకరణం చేసి అతణ్ని ఎలా ఆడుకుంటూ వచ్చారో అందరూ చూశారు. ఐతే ఈ మధ్య వైకాపా అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతకుమించిన మాటల తడబాటుతో సోషల్ మీడియాలో కామెడీ అయిపోతున్నారు.

ముఖ్యమంత్రి అయ్యాక అసలు ప్రెస్ మీట్లలో పాల్గొనడమే మానేసి.. లైవ్ పెట్టి ప్రెస్ వాళ్లు లేకుండా తాను ఏం చెప్పాలనుకున్నది చెబుతున్నారంతే. బయట ఎప్పుడో కానీ ఆయన కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. అక్కడ కూడా మీడియా వాళ్ల నుంచి పెద్దగా ప్రశ్నలేమీ ఉండట్లేదు. అలాంటి వాటిలో కూడా బోలెడన్ని తప్పులు దొర్లుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన మాట విని అందరూ అవాక్కయిపోయారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక మహిళ అని జగన్ పేర్కొనడం విశేషం.

https://www.youtube.com/watch?v=ZbbAf5bxMhs

గొల్లపూడిలో జరిగిన దిశ యాప్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి తడబాటుకు గురయ్యారు. దిశ యాప్ గురించి చెబుతూ.. ‘‘ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఓ మహిళ కాబట్టి’’ అన్నారు. వెంటనే పక్కనే ఉన్న హోంమంత్రి మేకతోటి సుచరిత కల్పించుకుని.. ‘‘హోమ్ మినిస్టర్’’ అని గుర్తు చేశారు.

అప్పుడు తేరుకున్న సీఎం.. ‘‘హోమ్ మినిస్టర్’’ అంటూ మాట సవరించుకున్నారు. గతంలో దిశ చట్టంపై అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడుతూ.. టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడానికి బైక్ దిగిన అమ్మాయి అంటూ దిశ గురించి వ్యాఖ్యానించడం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో దానిపై చాలానే ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత మరెన్నో సందర్భాల్లో జగన్ మాటలు తడబడ్డాయి. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక మహిళ అని వ్యాఖ్యానించడంతో సోషల్ మీడియాకు టార్గెట్ అయిపోయారు జగన్. లోకేష్‌తో పవన్ కళ్యాణ్ మాటలు తడబడ్డపుడు ఓ రేంజిలో ఆడుకున్న వైకాపా మద్దతుదారులు జగన్ తడబాటుపై ఏమంటారో మరి.