రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ ఆలస్యమెందుకు?

తెలంగాణ కాంగ్రెస్ కి బాస్ ఎవరు అనేది తేలి పోయింది. కొన్ని నెలలుగా టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి కట్టపెడుతున్నారనే విషయంపై చాలానే చర్చలు జరిగాయి. టీ కాంగ్రెస్ నేతలు ఈ పదవి కోసం.. ఇక్కడ రాష్ట్రాన్ని వదిలేసి మరీ.. ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో చర్చలు జరిపారు. చివరకు అందరూ ఊహించినట్లుగానే.. రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

ఈ నెల 26వ తేదీన ఆయనను టీపీసీసీ చీఫ్ గా ప్రకటించారు. అయితే.. ఆయన మాత్రం వెంటనే బాధ్యతలు చేపట్టలేదు. జులై 7వ తేదీన తాను బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించారు.

అయితే.. బాధ్యతల స్వీకరణను ఆయన అంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు..? ఆ రోజే ప్రమాణ స్వీకారం చేయడానికి ఏదైనా కారణం ఉందా అని చాలా మందిలో చర్చ మొదలైంది. దానికి ఓ కారణం ఉందట. ఎవరు అవునన్నా.. కాదన్నా.. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి గ్రూపులు ఉన్నాయనేది అందరికీ తెలిసిన సత్యమే.

టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలోనూ చాలా సీన్ జరిగింది. రేవంత్ రెడ్డికి ఆ పదవి ఇవ్వడం ఇష్టం లేనివారు ఆ పార్టీలో చాలా మందే ఉన్నారు. దీంతో.. అదిష్టానం ముందు చాలా సార్లు.. రేవంత్ కి ఇవ్వద్దని కూడా చెప్పారు. అయినప్పటికీ.. అధిష్టానం మాత్రం.. కేసీఆర్ ని తెలంగాణలో ఎదరించే సత్తా రేవంత్ కి మాత్రమే ఉందని నమ్మి.. ఆయనకు బాధ్యతలు అప్పగించింది.

అయితే.. బాధ్యతలు చేపట్టడానికి ముందు రేవంత్ ఓ పని చేయాలని అనుకుంటున్నాడట. త‌న‌ను వ్య‌తిరేకించినా స‌రే… పార్టీలో ఉన్న సీనియ‌ర్ నేత‌ల‌ను ప‌ద‌వీబాధ్య‌త‌లు తీసుకునే ముందే క‌ల‌వాల‌ని రేవంత్ నిర్ణ‌యించుకున్నాడు. అందుకే జానారెడ్డి, ష‌బ్బీర్ అలీ, పొన్నాల‌, వీహెచ్ వంటి నేత‌ల‌ను క‌లిశాడు. ఈ 7వ తేదీలోపు మ‌రికొంద‌రు నేత‌ల‌ను స్వ‌యంగా వెళ్లి క‌ల‌వ‌బోతున్నాడు. అంద‌ర్నీ క‌లుస్తూ… స‌మిష్టిగా ముందుకు వెళ్దాం, కాంగ్రెస్ కు అధికార‌మే ల‌క్ష్యంగా పనిచేద్దామని.. వారందరినీ కోరాలని అనుకుంటున్నాడట.

అందుకే.. తన బాధ్యతల స్వీకరణ ఘట్టాన్ని ఆయన జులై 7వ తేదీ వరకు వాయిదా వేసుకున్నారు. మరి ఈ మీటింగ్ ల తర్వాతైనా కాంగ్రెస్ కలిసి కట్టుగా కృషి చేసి.. గెలుపు కోసం శ్రమిస్తుందేమో చూడాలి.