నకిలీ వ్యాక్సిన్ తో లేడీ ఎంపీకి టోకరా..!

తానొక ఐఏఎస్ అధికారి అని నమ్మించి.. ఏకంగా ఎంపీకే టోకరా పెట్టాడు. నకిలీ వ్యాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేసి.. ఎంపీకీ.. ఆ నకిలీ వ్యాక్సిన్ ఇవ్వడం గమనార్హం. ఈ సంఘటన పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

టీఎంసీ ఎంపీ.. మిమి చక్రవర్తి వద్దకు ఇటీవల ఓ వ్యక్తి.. తానొక ఐఏఎస్ అధికారినంటూ నమ్మించి.. తనను తాను పరిచయం చేసుకున్నాడు. తాను వ్యాక్సిన్ డ్రైవ్ పెడుతున్నానని… వచ్చి ప్రారంభోత్సవం చేయాలని కోరాడు. ఆమె నిజమని నమ్మి వెళ్లి ప్రారంభోత్సవం చేసింది. నకిలీ వ్యాక్సిన్ కూడా వేయించుకుంది.

టీకా తీసుకున్న తర్వాత ఆమె మొబైల్‌కు ఎలాంటి మెసేజ్‌ రాకపోవడంతో అనుమానించిన మిమి చక్రవర్తి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు మిమి చక్రవర్తిని బురిడీ కొట్టించిన వ్యక్తి దేవాంజన్‌ దేవ్‌ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు

ఈ సందర్భంగా మిమి చక్రవర్తి మాట్లాడుతూ.. ‘‘దేవాంజన్‌ దేవ్‌ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి తనను తాను ఐఏఎస్‌ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధ్వర్యంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని తెలిపాడు. నన్ను ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా కోరాడు. అతడు చేస్తున్నది మంచి పని కావడంతో సరే అన్నాను. టీకా తీసుకునేలా జనాలను ప్రోత్సాహించడం కోసం నేను కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నాను’’ అని తెలిపారు.

‘‘వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత నాకు ఎలాంటి సర్టిఫికేట్‌ ఇవ్వలేదు. దాని గురించి నిందితుడిని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్పాడు. ఆ తర్వాత టీకా తీసుకున్నట్లు కోవిన్‌ నుంచి నా సెల్‌కు ఎలాంటి మెసేజ్‌ రాలేదు. దాంతో నాకు అనుమానం వచ్చి.. నాతో పాటు వ్యాక్సిన్‌ తీసుకున్న వారిని ప్రశ్నించాను. వారు కూడా నాలానే తమకు ఎలాంటి సర్టిఫికేట్‌ ఇవ్వలేదని.. టీకా వేసుకున్నట్లు ఎలాంటి మెసేజ్‌ రాలేదని తెలిపారు. ఈ వ్యవహారం ఏదో తేడాగా ఉందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాను. అతను నీలిరంగు బెకన్‌, నకిలీ స్టిక్కర్ ఉన్న కారులో నా దగ్గరకు వచ్చాడు’’ మిమి చక్రవర్తి అని తెలిపారు.