మకాం మార్చేసిన రష్మిక

ప్రస్తుతం ఇండియాలో బహు భాషల్లో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. ఆమె బేసిగ్గా కన్నడ నటి. అక్కడ తొలి సినిమా ‘కిరిక్ పార్టీ’తోనే ఆమె పెద్ద హిట్టు కొట్టి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక తెలుగులో రష్మిక వరుసగా ఛలో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు లాంటి ఘనవిజయాలతో పెద్ద స్టార్ అయిపోయింది. ఇటీవలే ‘సుల్తాన్’ సినిమాతో తమిళంలోకి కూడా అడుగు పెట్టింది రష్మిక. ఇప్పుడిక ఆమె హిందీలో ఆధిపత్యం చలాయించడానికి రెడీ అవుతోంది.

‘మిషన్ మజ్ను’తో పాటు అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న మరో హిందీ చిత్రంలోనూ రష్మిక నటించనున్న సంగతి తెలిసిందే. ఈపాటికే ఈ చిత్రాల షూటింగ్ మొదలు కావాల్సింది కానీ. కరోనా కారణంగా బ్రేక్ పడింది. ఐతే లాక్ డౌన్ షరతులు తొలగిపోయి మళ్లీ అన్ని ఇండస్ట్రీలూ షూటింగ్ దశలోకి వెళ్లనున్న నేపథ్యంలో బాలీవుడ్ ఒక అడుగు ముందే ఉంది. అక్కడ ఇప్పటికే షూటింగ్స్ మొదలైపోయాయి.

రష్మిక చేతిలో వివిధ భాషల్లో కలిపి దాదాపు అరడజను సినిమాలుండగా.. ఆమె కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత ముందుగా బాలీవుడ్లోనే షూటింగ్‌కు హాజరు కాబోతోంది. ‘మిషన్ మజ్ను’ కోసం రష్మిక ముందుగా డేట్లు ఇచ్చింది. ఇందుకోసం ముంబయికి చేరుకున్న రష్మిక అక్కడ కొత్తగా ఒక అపార్ట్‌మెంట్ ప్లాట్ తీసుకోవడం విశేషం. మామూలుగా సౌత్ నుంచి వెళ్లి హిందీలో సినిమా చేసే హీరోయిన్లు తాత్కాలికంగా హోటళ్లలో బస చేస్తారు. కానీ రష్మిక మాత్రం అలా కాకుండా ఫ్లాట్ అద్దెకు తీసుకుంది.

హిందీలో ఒకటికి రెండు చిత్రాల్లో నటించాల్సి ఉండటం.. భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో నటించే ఛాన్స్ ఉంటుందన్న ఆలోచనతో రష్మిక అక్కడ ఫ్లాట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను తీసుకున్న కొత్త ఫ్లాట్ గురించి అప్‌డేట్ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు కూడా పెట్టింది రష్మిక. చూస్తుంటే బాలీవుడ్ విషయంలో రష్మిక భారీ ప్రణాళికలతోనే ఉన్నట్లు కనిపిస్తోంది. తెలుగులో ఆమె ‘పుష్ప’లో కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.