కిరాతకుడిగా యంగ్ హీరో

టాలీవుడ్లో ఎంతో కష్టపడి ఒక స్థాయిని అందుకున్న నటుల్లో సాయికుమార్ ఒకడు. డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రయాణం మొదలుపెట్టి.. ఆ తర్వాత విలన్ వేషాలు వేసి.. ఆపై హీరోగా అరంగేట్రం చేసి కొన్ని ఘనవిజయాలను ఖాతాలో వేసుకున్నారాయన. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్‌గా స్థిరపడ్డారు. సాయికుమార్ మాత్రమే కాక.. ఆయన తండ్రి పీజే శర్మ.. తమ్ముళ్లు రవిశంకర్, అయ్యప్ప శర్మ సైతం కష్టపడి ఎదిగిన వాళ్లే.

సాయికుమార్ వారసత్వాన్నందుకుంటూ హీరోగా అరంగేట్రం చేసిన ఆది సైతం బాగానే కష్టపడుతున్నాడు కానీ.. అతడికి కాలం కలిసి రావట్లేదు. కెరీర్ ఆరంభంలో ప్రేమ కావాలి, లవ్లీ లాంటి సినిమాలతో పర్వాలేదనిపించాడు కానీ.. ఆ తర్వాత అతడిని వరుసగా పరాజయాలే పలకరించాయి. దశాబ్ద కాలం నుంచి ఒక హిట్టు కోసం ఎదురు చూస్తున్న అతడికి ఆశించిన ఫలితం దక్కట్లేదు. అలాగని అతడికి అవకాశాలేమీ ఆగిపోవట్లేదు.

ఇటీవలే ‘శశి’ చిత్రంతో పలకరించిన ఆది.. ప్రస్తుతం నాలుగు చిత్రాలను చేతిలో పెట్టుకోవడం విశేషం. అందులో ఇంతకుముందు తనతో ‘చుట్టాలబ్బాయి’ సినిమా తీసిన వీరభద్రం చౌదరితో చేస్తున్న చిత్రం కూడా ఒకటి. ఈసారి ఈ ఇద్దరూ కలిసి యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ‘కిరాతక’ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ చూస్తే కొంచెం వయొలెంట్‌గానే ఉంది.

ఐతే ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. అహనా పెళ్లంట, పూలరంగడు లాంటి హిట్లతో తనపై అంచనాలు పెంచిన వీరభద్రం.. ఆ తర్వాత నాగార్జునతో చేసిన ‘భాయ్’తో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఆ సినిమా అతడి కెరీర్‌ను గట్టి దెబ్బే కొట్టింది. ఆపై ఆదితో చేసిన ‘చుట్టాలబ్బాయి’ నిరాశ పరిచింది. దీంతో చాలా గ్యాప్ తీసుకుని ఈసారి ‘కిరాతక’ చేస్తున్నాడు వీరభద్రం. దర్శకుడికి, హీరోకు ఇద్దరికీ కూడా హిట్ చాలా అవసరమైన స్థితిలో ఈ చిత్రం వీరికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.