జగన్ వాదన నిలుస్తుందా ?

అప్పుడెప్పుడో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. అయిపోయిన పనులకు బిల్లులు చెల్లించకపోతే పనులుచేసిన కాంట్రాక్టర్ల పరిస్ధితి ఏమిటనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించటంలేదు. 2018-19లో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో జరిగిన పనులకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు.

2018-19లో పనుల బిల్లులను 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత చెల్లించాలి. కానీ ప్రభుత్వం మారిపోవడంతో అంతా తారుమారైపోయింది. ఆ దెబ్బకు అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు బిల్లులు రాలేదు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపులపై కోర్టులో కేసు వేశారు. ఆ విచారణలో కోర్టు ప్రభుత్వాన్ని గట్టిగానే చివాట్లు పెట్టింది.

అయిపోయిన రెండు పనులకు సంబంధించిన బిల్లులు రు. 50 లక్షలు కూడా లేదు. అలాంటిది డబ్బులు లేవన్న సాకుతో బిల్లులు ఆపేయటం జగన్ కు ఎంతమాత్రం తగదు. ఒకవైపు వేల కోట్లరూపాయాలను సంక్షేమానికి ఖర్చుపెడుతున్నట్లు జగనే స్వయంగా చెబుతున్నారు. మరోవైపు రెండు బిల్లులను చెల్లించేందుకు డబ్బులు లేవంటే ఎవరైనా నమ్ముతారా ?

ఇదే ప్రశ్న కోర్టు కూడా అడిగింది. మరి ఉన్నతాధికారులు ఏమని సమాధానం చెబుతారో చూడాలి. టీడీపీ హయాంలో జరిగిన పనులకు తామెందుకు బిల్లులు చెల్లించాలనే ఆలోచనలో ఉంటే అది పూర్తిగా తప్పని ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి. పనులు చేసిన కాంట్రాక్టర్లు టీడీపీ నేతలే అయ్యుండచ్చు అయినా అయిపోయిన పనులకు బిల్లులు ఆపటం మాత్రం తప్పే. మరి తన తప్పును జగన్ ప్రభుత్వం ఎప్పుడు సరిచేసుకుంటుందో ?