థియేటర్లకు మోక్షం ఇప్పుడే కాదు

ఊహించని విధంగా తెలంగాణలో లాక్ డౌన్‌ పూర్తి స్థాయిలో ఎత్తేస్తూ థియేటర్లు, మాల్స్ సహా అన్నీ తెరుచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. సినీ జనాలకు ఇది ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. లాక్ డౌన్ ఎత్తేసినా థియేటర్ల మీద ఆంక్షలు ఉంటాయని భావించారు. కానీ అలాంటిదేమీ లేకపోయింది. 50 పర్సంట్ ఆక్యుపెన్సీ అంటూ షరతులు కూడా ఏమీ లేవు. ఎప్పట్లాగే థియేటర్లను పూర్తి స్థాయిలో నడుపుకోవచ్చు.

ఈ వెసులుబాటు ఇచ్చేశారు కదా అని థియేటర్లను నడిపిద్దామంటే సినిమాలు లేని పరిస్థితి. ఎవ్వరూ అసలు థియేటర్లే తెరవలేదు. పున:ప్రారంభానికి థియేటర్లు రెడీ చేస్తున్నప్పటికీ.. కనీసం జులై మొదటి వారం నుంచి అయినా అవి కళకళలాడుతాయా అంటే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. ఆగస్టు వరకు ఎదురు చూడక తప్పేలా లేదన్నది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

కాస్త పేరున్న సినిమాలను రిలీజ్ చేయాలన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లు తెరుచుకోవాలి. ఏ ఆంక్షలూ లేకుండా పూర్తి స్థాయిలో థియేటర్లు నడవాలి. కానీ ఏపీలో ఇంకా పాక్షికంగా లాక్ డౌన్ నడుస్తోంది. సాయంత్రం 6 గంటల తర్వాత కర్ఫ్యూ అమలవుతోంది. థియేటర్లలో రోజుకు నాలుగు షోలు నడిపించే పరిస్థితి లేదు. పైగా ఆక్యుపెన్సీ విషయంలో స్పష్టత కొరవడింది. దీంతో అక్కడ థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు. పైగా అక్కడ టికెట్ల రేట్ల విషయంలో పీఠముడి బిగుసుకుంది.

ఈ సమస్యలన్నీ పరిష్కారమై ఒకప్పట్లా థియేటర్లు నడవాలంటే నెల రోజులకు పైగానే పట్టేలా ఉంది. ఆగస్టు మొదటి వారానికి కాపీ ఆ పరిస్థితులు రాకపోవచ్చు. అందుకే ఇటు నిర్మాతలు, అటు ఎగ్జిబిటర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. జులైలో థియేటర్లు తెరుచుకున్నప్పటికీ పాత సినిమాలనే నెల పాటు నడిపించి.. ఆ తర్వాత పరిస్థితులను బట్టి కొత్త చిత్రాలను విడుదల చేస్తారని అంచనా వేస్తున్నారు.