ద‌ర్శ‌కుడిని త‌ప్పించారా.. త‌ప్పుకున్నాడా?


ఒక సినిమాకు ద‌ర్శ‌కుడిగా ఎంపికై.. ఆ చిత్ర బృందంతో క‌లిసి ఏడాదికి పైగా ప్ర‌యాణం చేశాక‌.. ఆ స్క్రిప్టును బాగా ఆక‌ళింపు చేసుకుని చిత్రీక‌ర‌ణ‌కు సిద్ధం అయ్యాక‌.. ఆ సినిమా నుంచి ద‌ర్శ‌కుడు బ‌య‌టికి రావాల్సి వ‌స్తే మొత్తంగా చిత్ర బృందంలో ఒక అల‌జ‌డి రేగుతుంది. ఆ ద‌ర్శ‌కుడికి కూడా అది చాలా ఇబ్బందిక‌ర ప‌రిస్థితే. ఐతే కొన్నిసార్లు ఇలాంటి బ్రేక‌ప్స్ త‌ప్ప‌వు. బాలీవుడ్లో ఓ సినిమా విష‌యంలో ఇప్పుడు అదే జ‌రిగింది.

మ‌న లెజెండ‌రీ క్రికెట‌ర్ మిథాలీ రాజ్ జీవిత క‌థ ఆధారంగా శ‌భాష్ మిథు పేరుతో ఏడాది కింద‌టే ఓ సినిమాకు రంగం సిద్ధం కావ‌డం తెలిసిందే. ప్రియా అవెన్ రాసిన క‌థ‌తో రాహుల్ డోలాకియా ద‌ర్శ‌క‌త్వంలో అజిత్ అంధారె ఈ సినిమాను నిర్మించ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఏడాది నుంచి స్క్రిప్టు మీద‌, అలాగే ప్రి ప్రొడ‌క్ష‌న్ మీద టీం ప‌ని చేస్తోంది. తాప్సి ఈ సినిమా కోసం క్రికెట్ నేర్చుకుని మిథాలీలా రూపాంత‌రం చెందే ప్ర‌య‌త్నంలో ఉంది.

ఇక కొన్ని రోజుల్లో షూటింగ్ మొద‌లు కావాల్సి ఉండ‌గా.. ఈ సినిమా నుంచి రాహుల్ డోలాకియా త‌ప్పుకున్నాడు. ఇంత‌కుముందు షారుఖ్ ఖాన్‌తో ర‌యీస్ లాంటి భారీ చిత్రం తీసిన రాహుల్ స్థాయికి ఇది చిన్న సినిమానే. ఐతే ఏడాదికి పైగా ట్రావెల్ చేశాక ఇప్పుడ‌త‌ను ఈ చిత్రం నుంచి త‌ప్పుకున్నాడు. అత‌డి స్థానంలోకి శ్రీజిత్ ముఖ‌ర్జీ అనే కొత్త ద‌ర్శ‌కుడు వ‌చ్చాడు. దీని గురించి రాహుల్ స్వ‌యంగా పెద్ద ప్రెస్ నోట్ ఇచ్చాడు. త‌న‌కెంతో న‌చ్చిన స్క్రిప్టు, న‌చ్చిన సినిమా అంటూనే అనివార్య కార‌ణాల‌తో ఈ సినిమా నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింద‌న్నాడు. చిత్ర బృందం గురించి అత‌ను చాలా బాగా మాట్లాడాడు. కానీ ఎందుకు త‌ప్పుకోవాల్సి వ‌చ్చిందో మాత్రం వెల్ల‌డించలేదు. ప‌రోక్షంగా క‌రోనా మీద నెపం నెట్టాడు.

ఐతే సైనా సినిమా డిజాస్ట‌ర్ అయిన నేప‌థ్యంలో మిథాలీ సినిమాపై చిత్ర బృందంలో ర‌క‌ర‌కాల సందేహాలు త‌లెత్తాయని.. ఈ క్ర‌మంలో స్క్రిప్టు విష‌య‌మై ర‌చ‌యిత‌, నిర్మాత‌తో రాహుల్‌కు విభేదాలు వ‌చ్చాయ‌ని.. దీంతో అత‌ను ఈ సినిమా నుంచి త‌ప్పుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింద‌ని బాలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి.