తెలుగు రాష్ట్రాల నుంచి థర్డ్ ఫ్రంట్ లోకి వెళ్లేదెవరు?

ప్రధాని మోడీ గ్రాఫ్ అంతకంతకూ పడిపోతున్న వేళ.. బీజేపీ..కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలన్న తలంపు జాతీయ స్థాయిలో సాగుతోంది. దీని కోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు దన్నుగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలుస్తున్నారు. ఈ రోజున తన ఇంట్లో జరిగే సమావేశానికి వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు.. మేధావుల్ని శరద్ పవార్ ఆహ్వానిస్తున్నారు. ఈ మీటింగ్ కు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరయ్యే కీలక నేతలు ఎవరూ లేరనే చెప్పాలి.

రానున్న రోజుల్లో థర్డ్ ఫ్రంట్ లోకి వెళ్లేదెవరు? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్.. జగన్ తో పాటు చంద్రబాబుల్లో ఎవరైనా మూడో ఫ్రంట్ లోకి వెళ్లే అవకాశం ఉందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్ని చూసినప్పుడు.. థర్డ్ ఫ్రంట్ లో తెలుగు రాష్ట్రాల రోల్ ఉండదనే మాట బలంగా వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విషయానికి వస్తే.. మోడీ మీద కోపంతో ఉన్న వేళలో థర్డ్ ఫ్రంట్ ను తెర మీదకు తీసుకురావటమే కాదు.. జాతీయస్థాయిలో తానే ముందుండి జట్టు కట్టిస్తానని చెప్పటం.. తర్వాత గమ్మున ఉండటం తెలిసిందే.

తన కుమారుడు కేటీఆర్ కేంద్రం మీద తరచూ విమర్శలు చేస్తున్నప్పటికీ.. కేసీఆర్ మాత్రం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో పలు సభలు.. సమావేశాల్లో పాల్గొన్నప్పటికి కేంద్రంలోని మోడీ సర్కారు మీద సూటిగా వ్యాఖ్యలు చేసింది లేదు. అదే సమయంలో మోడీ సర్కారు సైతం కేసీఆర్ తో పెట్టుకోవాలనుకోంటం లేదని చెప్పాలి. ఒకవైపు తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని.. ఆయన జైలుకు వెళ్లటం ఖాయమని చెబుతున్నా.. జరుగుతున్న పరిణామాల్ని చూస్తుంటే అలాంటి పరిస్థితి కనుచూపు మేర కనిపించటం లేదు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అవసరమైన స్థానాలు సాధించని పక్షంలో.. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన దన్ను కేసీఆర్ నుంచి పొందేందుకు అవకాశాల్ని సజీవంగా ఉంచాలన్న ఎత్తుగడలో మోడీషాలు ఉన్నట్లు చెబుతారు.

మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే..తాను.. తన సంక్షేమ పథకాలతో బండిని లాగిస్తున్న ఆయన.. కేంద్రానికి వ్యతిరేకంగా ఉండాలన్న ఆలోచనలో లేరనే చెబుతున్నారు. దీనికి తోడు రాష్ట్రానికి అవసరమైన చేయూతను మోడీ సర్కారు అందిస్తున్నప్పుడు మూడో ఫ్రంట్ వైపు చూడాల్సిన అవసరమే లేదని చెప్పాలి. ఏపీ ప్రజల్లో జగన్ కున్న ఆదరణ తెలిసిన కేంద్రం.. ఆయనతో పెట్టుకోవాలన్న ఆలోచనలో లేదనే చెప్పాలి.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితి మరోలా ఉంది. ఒకప్పుడు రాజకీయంగా చక్రం తిప్పిన ఆయనకు కాలం కలిసిరావటం లేదు. ఎంతలా ప్రయత్నించినా ఆయన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న విమర్శ వినిపిస్తోంది.

దీనికి తోడు 2019 ఎన్నికల్లో మోడీని తీవ్రంగా విమర్శించి.. ఆయనతో ఉన్న స్నేహబంధాన్ని కటీఫ్ చెప్పటం ద్వారా జరిగిన నష్టం తెలిసిందే. ఈ కారణంతోనే మోడీతో పెట్టుకోవటానికి బాబు సిద్ధంగా లేరని చెబుతున్నారు. ఈ కారణాలతో జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న థర్డ్ ఫ్రంట్ లో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉండే అవకాశం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.