రామోజీరావు ఓటీటీ బిజినెస్!

పాండమిక్ సమయంలో జనాలు ఓటీటీలకు అతుక్కుపోయారు. అందుకే సినిమాలు, సిరీస్ లు చూసుకుంటూ కాలక్షేపం చేశారు. దీంతో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. కొత్త సినిమాలను కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. నాని ‘వి’, అనుష్క ‘నిశ్శబ్దం’ లాంటి సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేశారు. ఈ మధ్యకాలంలో మరిన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ సినిమా కూడా ఓటీటీలోనే విడుదలైంది. ఒరిజినల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.

ఇప్పుడు కొత్తగా మరో ఓటీటీ రాబోతుందని సమాచారం. ప్రముఖ వ్యాపారవేత్త, ఈటీవీ సంస్థ యజమాని రామోజీరావు ఓటీటీలోకి ఎంటర్ అవ్వబోతున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో ఓటీటీను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈటీవీలో వందల కొద్దీ సినిమాలు ఉన్నాయి. శాటిలైట్ కి డిమాండ్ లేని రోజుల్లో వచ్చిన ఈటీవీ.. అప్పట్లో వందల సినిమాలను తక్కువ ధరకు కొనేసింది. ఈటీవీలో ప్రసారమవుతున్న సినిమాలన్నీ అప్పటివే.

ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ నుండి వచ్చినా సినిమాలే చాలా ఉన్నాయి. వీటిని ఈటీవీలో తప్ప మరెక్కడా చూడలేం. ఇప్పుడు ఆ సినిమాలన్నింటినీ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. ఎన్ని రిలీజ్ చేసినా.. ఒరిజినల్ కంటెంట్ కూడా ఉండాలి కదా.. అందుకే సినిమాలు, టాక్ షోలు, వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నారు. వీటి కోసం రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారట.

ఉషాకిరణ్ బ్యానర్ మీదే చిన్న సినిమాలను నిర్మించి ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఇప్పటికీ ఈటీవీ సంస్థలో కొన్ని స్క్రిప్ట్ లను లాక్ చేసి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. కొందరు యంగ్ డైరెక్టర్లతో ఈ సినిమాలను రూపొందించనున్నారు. యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడంతో పాటు ఎక్కువ కంటెంట్ ను జెనరేట్ చేయాలని నిర్ణయించుకున్నారు.