కేసీయార్ టూర్లకు ఈటలే కారణమా ?

మామూలుగా అయితే నెలల తరబడి ఫాం హౌస్ నుండి బయటకే రారనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఫాం హౌస్ నుండి ప్రగతి భవన్ కు వచ్చినా సెక్రటేరియట్ కు రారని, మంత్రులు, ఉన్నతాధికారులకు కూడా అందుబాటులో ఉండరనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాంటి కేసీయార్ ఇపుడు వరుసబెట్టి జిల్లాల్లో టూర్లు చేస్తున్నారు. పైగా వరుసబెట్టి బహిరంసభల్లో కూడా పాల్గొంటున్నారు. విషయం ఏమిటా అని ఆరాతీస్తే బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ దెబ్బే కారణమని అర్ధమవుతోంది.

ఈటలకు కేసీయార్ జిల్లాల టూర్లకు సంబంధం ఏమిటి ? ఏమిటంటే తొందరలోనే హుజూరాబాద్ అసెంబ్లీకి ఉపఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని ఈటల రాజేందర్ పట్టుదలగా ఉన్నారు. ఇదే సమయంలో ఈటలను ఓడించాలనే పట్టుదల కేసీయార్లో కూడా కనబడుతోంది. సో ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చేంతలోపు వీలైనన్ని జిల్లాల్లో టూర్లు చేయాలని కేసీయార్ ప్లాన్ చేశారట.

ఎందుకయ్యా అంటే రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపనులు చెప్పుకునేందుకు. రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల్లాగే హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా తమ ప్రభుత్వం అనేక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లు చేసిందని చెప్పుకుంటున్నారు. ఇతర జిల్లాల్లో తాను చెబుతున్న మాటలు హుజూరాబాద్ నియోజకవర్గంలోని జనాలు కూడా వినాలని, తనపై నమ్మకం పెంచుకోవాలని కేసీయార్ కోరుకుంటున్నారట.

కేసీయార్ ఆలోచన బాగానే ఉంది కానీ హుజూరాబాద్ లో అభివృద్ధి జరిగిందంటే ఆ క్రెడిట్ ముందుగా ఈటలకే దక్కుతుంది. ఎందుకంటే ఇక్కడి ఎంఎల్ఏగా ఈటల నాలుగుసార్లుగా వరుసగా గెలుస్తున్నారు కాబట్టే. అభివృద్ధి సంగతిని పక్కనపెట్టేస్తే ఈటలను బర్తరఫ్ చేసి అవమానించటం, ఎంఎల్ఏగా రాజీనామా చేసే పరిస్ధితులు సృష్టించటం మాటేమిటి ? ఈటల విషయంలో కేసీయార్ వ్యవహరించిన తీరును నియోజకవర్గం ప్రజలు గమనించకుండానే ఉంటారా ?

అసలు సెంటిమెంట్ ముందు అభివృద్ధి నినాదం పనిచేస్తుందా ? సెంటిమెంట్ ముందు అభివృద్ధి నినాదం అంతగా పనిచేయదని గతంలో చాలాసార్లు రుజువైంది. మొత్తానికి ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారనే విషయాన్ని పక్కనపెట్టేస్తే ఈటల వివిధ ప్రాంతాల్లో టూర్లు చేస్తున్నట్లే కేసీయార్ కూడా టూర్లు మొదలుపెట్టారు. కేసీయార్ టూర్ల క్రెడిట్ మాత్రం ఈటలకే దక్కుతుందనే సెటైర్లు మాత్రం వైరల్ అవుతోంది.