కేంద్రం దివాళా తీసిందా? మోడీపై సుప్రీం ఫైర్‌..

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీపై సుప్రీం కోర్టు మ‌రోసారి విరుచుకుప‌డింది. క‌రోనాతో మృతి చెందిన వారికి ప‌రిహారం ఇవ్వ‌లేమ‌ని ఇప్ప‌టికే చూచాయ‌గా ప్ర‌క‌టించేసిన కేంద్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగింది. గ‌త కొన్ని వారాలుగా దేశంలో నెల‌కొన్న క‌రోనా ప‌రిస్థితులు, వ్యాక్సిన్, కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న తీరుల‌పై సుప్రీం కోర్టు సుమోటోగా కేసు విచార‌ణ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌రిగిన విచార‌ణ‌లో క‌రోనా మృతుల కుటుంబాల‌కు ప‌రిహ‌రం ఇచ్చే అంశాన్ని సుప్రీం కోర్టు సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించింది.

కీల‌క వ్యాఖ్య‌లు..

‘క‌రోనాతో మృతి చెందిన వారి బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వొద్దని ప్రధాని నేతృత్వంలోని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ చెప్పిందా” అంటూ సుప్రీం కోర్టు కేంద్రాన్ని నిల‌దీసింది.

క‌రోనాతో మృతి చెందిన‌వారి బాధిత కుటుంబాలకు పరిహారం అందించలేమని కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీం కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. పరిహారం చెల్లించడం.. ఆర్థిక స్థోమతకు మించి భారం మాత్రమే కాదని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. తమ వద్ద అంత డబ్బు లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది.

వారికి హ‌క్కు ఉంది..

“మీరు(కేంద్రం) స్పష్టత ఇవ్వడం సరైనదే. ప్రభుత్వం డబ్బు లేదని చెప్పడంలో విస్తృతమైన పరిణామాలు ఉన్నాయి” అని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది. అయితే విపత్తు నిర్వహణ చట్టం 2005 సెక్షన్ 12 ప్రకారం.. ప్రకృతి విపత్తులతో మరణించిన వారికి పరిహారం పొందే హక్కుందని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు విపత్తులను ఎదుర్కోవటానికి ఆర్థిక సంఘం సిఫార్సులు చేసినట్లు తెలిపింది. అయితే “పరిహారం ఇవ్వకూడదని ప్రధాని నేతృత్వంలోని ఎన్డీఎంఏ ఏదైనా నిర్ణయం తీసుకుందా?” అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ, విపత్తు నిర్వహణ ప్రత్యేక విభాగం తీసుకున్న నిర్ణయాల గురించి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వెల్లడించారు.

తీర్పుపై స‌స్పెన్స్‌!

కరోనా విధులు నిర్వహిస్తున్న 22 లక్షల మంది వైద్య సిబ్బందికి బీమా పథకాన్ని వర్తింపజేసినట్లు తెలిపారు. ఇదిలావుంటే, కరోనా కారణంగా మరణించిన వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ధృవీకరణ పత్రాలను మంజూరు చేసే ప్రక్రియను సరళతరం చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కొవిడ్ బాధితులపై ఆధారపడినవారు అటువంటి ధృవీకరణ పత్రాలను జారీ చేసిన తర్వాత కూడా సవరణలు చేయడాన్ని సరళీకృతం చేయాలని కేంద్రాన్ని సూచించింది. తద్వారా లబ్ధిదారులు.. సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందగలరని పేర్కొంది. అందరికి సమానంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని.. ఈ మేరకు చట్టం చేయాలని పేర్కొంది. అయితే.. ప‌రిహారం ఇచ్చే విష‌యంపై తుది తీర్పును సుప్రీం కోర్టు రిజ‌ర్వ్ చేసింది.